పెద్దపల్లి, జనవరి 17 : రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సంపర్క్క్రాంతి రైలు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం దేశ రాజధాని ఢిల్లీతో తెలంగాణ అనుసంధానా న్ని వద్దనుకొంటున్నది. రైల్వే ప్రయాణికులకు రాష్ట్రంలోని రైల్వేస్టేషన్ల నుంచి నేరుగా ఢిల్లీకి నడిపించాల్సిన తెలంగాణ సంపర్క్క్రాంతి రైలు ఊసెత్తడం లేదు. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడి ఏడున్నర ఏండ్లు గడిచినా ఈ రైలుపై ఎలాంటి స్పందనా లేదు. వాస్తవానికి, దేశంలో ప్రతి ఒక్క రాష్ర్టానికి ఆయా రాష్ర్టాల పేరుతో సంపర్క్క్రాంతి రైళ్లు నడిపిస్తున్న రైల్వే అధికారులు రాష్ట్రం విషయంలో మాత్రం మొండిగానే వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాలు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి సంపర్క్క్రాంతి రైళ్లు ఢిల్లీకి నడుస్తున్నాయి. ఏపీ సంపర్క్క్రాంతి వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు తిరుపతి నుంచి నిజాముద్దీన్ మూడు రోజులు, నిజాముద్దీన్ నుంచి తిరుపతి 12708/07 వయా కాచిగూడ-కాజీపేట మూడు రోజులు నడుస్తుంది. తమిళనాడుకు ఒక వీక్లీ సూపర్ఫాస్ట్, కర్ణాటకకు మూడు సంపర్క్ క్రాంతి రైళ్లు, కేరళ కు ఒకటి ఉన్నాయి. ఇక, మూడేండ్ల కిందట లోక్సభ ఎన్నికల ముందు దక్షిణ మధ్య రైల్వే జోన్లోని నాం దేడ్ డివిజన్లో.. నాందేడ్ నుంచి నిజాముద్దీన్ మధ్య మరాట్వాడ సంపర్క్ క్రాంతి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. మరాట్వాడ అనేది మహారాష్ట్రలో 8 జిల్లాలతో కూడిన ప్రాంతం. అలాంటి ఒక ప్రాంతం నుంచి ఒక సంపర్క్ క్రాంతి రైలును ప్రారంభించారు. కానీ తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డా కూడా ప్రత్యేక రైలును ప్రారంభించకపోవడం విచారకరం.
సంపర్క్క్రాంతి రైలు అంటే..
సంపర్క్ క్రాంతి రైలు అనేది రాష్ట్ర రాజధాని, లేదా రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు, పుణ్యక్షేత్రాల నుంచి దేశ రాజధానిని కలిపే రైలు. ప్రస్తుతం మన దేశంలో 20 రాష్ర్టాలు, ప్రాంతాల పేరుతో సంపర్క్క్రాంతి రైళ్లు నడుస్తున్నాయి. మన రాష్ట్రంలో కొత్త సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ రైలుని సికింద్రాబాద్ నుంచి డెహ్రాడూన్ వయా నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, బల్లార్షా, నాగ్పూర్ మీదుగా నడపాలి. మరో వీక్లీ సంపర్క్ క్రాంతి రైలును నిజామాబాద్, ఆదిలాబాద్, నాగ్పూర్ మీదుగా నడపాలనే ప్రతిపాదనను పలువురు ఎంపీలు ఫిబ్రవరిలో రైల్వే బోర్డుకు విన్నవించారు.
కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీలకు పట్టింపే లేదు
కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ ఎంపీలు ఈ ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్లాల్సి ఉన్నా, పట్టించుకొన్న దాఖలాల్లేవు. కనీసం వీటి గురించి కేంద్రమంత్రికి తెలియనే తెలియదు. 2019 ఫిబ్రవరిలో రాజ్యసభ సమావేశాల సమయంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్నేతకాని, మరో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు అప్పటి రైల్వేమంత్రిని వేర్వేరుగా కలిసి విజ్ఞప్తిచేశారు. తెలంగాణకు సంపర్క్క్రాంతి రైలు ప్రతిపాదన ఉన్నదా? అని అడగ్గా ఎలాంటి ప్రతిపాదన లేదని, దక్షిణ మధ్య రైల్వే అధికారులు తమకెలాంటివి పంపలేదని సమాచారం ఇచ్చారు. తెలంగాణ ఏర్పడి ఏడున్నరేండ్లు గడుస్తున్నా కేంద్రం ప్రత్యేక రైలును నడపకపోవడంతో రాష్ట్ర ప్రజలు దేశ రాజధానికి వెళ్లేందుకు అసౌకర్యానికి గురవుతున్నారు.