హైకోర్టులో సీఎస్ సోమేశ్కుమార్ తరఫున ఏజీ వాదన
సీఎస్ లేఖపై నిర్ణయాన్ని నేడు చెబుతామన్న కేంద్రం
హైదరాబాద్, మార్చి 9 : ఒక రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సర్వీస్ అధికారిని మరో రాష్ట్ర సర్వీసులోకి తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేయాలని, ఆయనను తెలంగాణ సర్వీసులోకి తీసుకోవాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంపై ఏజీ ఈ వాదన చేశారు.
క్యాట్ ఆదేశాలను అమలు చేయలేదని మొహంతి దాఖలు చేసిన కోర్టు ధికార కేసులో ఈ నెల 11న సోమేశ్కుమార్ స్వయంగా విచారణకు హాజరుకావాలని క్యాట్ ఉత్తర్వులు జారీచేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో సోమేశ్కుమార్ రాసిన లేఖపై తగిన నిర్ణయం తీసుకొనేలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సోమేశ్కుమార్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఏ వెంకటేశ్వర్రెడ్డితో కూడిన హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. సోమేశ్కుమార్ లేఖపై కేంద్ర వైఖరిని గురువారం తెలియజేస్తామని సొలిసిటర్ జనరల్ ఎస్ రాజేశ్వర్రావు చెప్పారు. దీంతో తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది.