నెల రోజుల నిరీక్షణకు తెర
సోమవారం ఉత్తర్వుల జారీకి అవకాశం
మిల్లర్స్ అసోసియేషన్ హర్షాతిరేకాలు
ఫలించిన రాష్ట్ర ప్రభుత్వ కృషి
మంత్రి గంగుల ప్రత్యేక చొరవ
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది. నెల రోజుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో దిగొచ్చిన కేంద్రం.. రాష్ట్రం నుంచి సీఎమ్మార్ (బియ్యం) సేకరణకు అంగీకరించింది. ఇందుకు సంబంధించి సోమవారం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయనున్నది. చిన్న సమస్యలను సాకుగా చూపి రాష్ట్రం నుంచి గత నెల 7 నుంచి యాసంగి సీఎమ్మార్ స్వీకరణను కేంద్రం నిలిపివేసింది. దీంతో 92 లక్షల టన్నుల బియ్యం మిల్లులు, గోదాములు, ఫంక్షన్ హాళ్లలో గుట్టలుగా పేరుకుపోయింది. దీని విలువ రూ.22 వేల కోట్లు. మిల్లింగ్ పరిశ్రమ మొత్తం మూతపడ్డది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, అధికారులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ఎప్పటికప్పుడు కేంద్రం, ఎఫ్సీఐ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు.
ఇటు.. మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితో సీఎస్ సోమేశ్ కుమార్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పరిస్థితిపై సమీక్షించారు. కేంద్రాన్ని ఏ విధంగా ఒప్పించాలి? మొండికేస్తే భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలనేదానిపై చర్చించారు. రెండు, మూడు సార్లు ఢిల్లీకి వెళ్లి అధికారులను కలిసి క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు. మంత్రి గంగుల పరిస్థితిని సమీక్షిస్తూ..మిల్లర్లతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా వెరవకుండా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సీఎమ్మార్ సమస్యను పరిష్కరించింది. దీంతో నెల పాటు మూతపడిన మిల్లులు తెరుచు కోనున్నాయి. గత యాసంగి సీఎమ్మార్ గడువును కూడా మరో నెల పాటు పొడిగించేందుకు కేంద్రం అంగీకరించింది. 2020-21 యాసంగికి సంబం ధించి ఇంకా 3.5 లక్షల టన్నుల సీఎమ్మార్ ఇవ్వాల్సి ఉన్నది. సీఎమ్మార్ సమస్య పరిష్కారం కావడంపై మిల్లర్లు హర్షం వ్యక్తం చేశారు. కాగా, రాష్ట్రంపై రాజకీయ కక్ష సాధించాలనే కేంద్రం నెల పాటు సీఎమ్మార్ స్వీకరణను నిలిపి వేసిందనే విమర్శలు వస్తున్నాయి. అటు.. మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి 2, 3 రోజుల్లో నూక శాతం నివేదిక రానున్నట్టు తెలిసింది.
ప్రభుత్వ కృషి ఫలించింది
సీఎమ్మార్ స్వీకరణకు కేంద్రాన్ని ఒప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చాం. దీంతో కేంద్రం సీఎమ్మార్ స్వీకరణకు అంగీకరించింది. రైతులతో ముడిపడిన అంశాన్ని కూడా కేంద్రం రాజకీయ కోణంలో చూడటం బాధాకరం. ఇన్ని రోజులు కేంద్రం తీరుతో రైతులకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని ఆందోళన కలిగింది. ఇప్పటికైనా కేంద్రం వాస్తవాలను గ్రహించినందుకు సంతోషం. – గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి