Jangaon | జనగామ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతున్నది. శనివారం నాడు స్టేషన్ ఘన్పూర్ మండలం, మీదికొండ, తాటికొండ, జీట్టేగూడెం, గండిరామారం, గ్రామాల్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నోడల్ అధికారి మాణిక్ రాజ్, అమృత్ సరోవర్ పథకంలో భాగంగా జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. గండిరామారం రిజర్వాయర్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర జల శక్తి అభియాన్ ద్వారా నీటి వనరుల సేకరణ, వాటర్ మేనేజ్మెంట్ సిస్టం, వాటర్ సంబంధిత పంటలు దాని ద్వారా ఉపయోగపడే అంశాలను ప్రజలకు చేరవేయాలని తద్వారా రైతుల వ్యవసాయం కోసం, పశువులకు అవసరాలకు భూగర్భ జలాలు అందుతాయన్నారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రవేశపెట్టిన పథకాల అమలులో సంతృప్తికరంగా ప్రజలకు సేవలు అందుతున్నాయని ఆయన తెలిపారు.