జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, ఇండ్లు, రహదారులతో పాటు వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు నలుగురు సభ్యుల కేంద్ర బృందం గురువారం జిల్లాలో పర్యటించింది. ముందుగా జెన్ కో గెస్ట్ హౌస్లో వరదల కారణంగా నష్టపోయిన వివరాలను కేంద్ర బృందానికి కలెక్టర్ భవేష్ మిశ్రా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
గోదావరి నదికి ఇంత పెద్ద ఎత్తున వరదలు రావడం ఇదే తొలిసారి అని అన్నారు. ఈ నెల 10,11 తేదీలలో అసాధరణ రీతిలో మహాముత్తారం మండలంలో వర్షం కురిసిందని వారికి వివరించారు. పలిమెల, మహదేవ్ పూర్, మహా ముత్తారం, కాటారం, మల్హర్ రావు, భూపాలపల్లి మండలాలు వరదల వల్ల తీవ్రంగా నష్ట పోయాయని వివరించారు.
కాగా, వరదల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. 251 జంతువులు చనిపోయాయని వెల్లడించారు. NDRF సహాయంతో వరద ప్రభావిత గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టి నట్లు కలెక్టర్ కేంద్ర బృందానికి వివరించారు.