హైదరాబాద్/జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్ స్వల్పంగా కుంగిన నేపథ్యంలో మంగళవారం అక్కడ కేంద్ర బృందం పరిశీలించింది. ఈ నెల 21న బరాజ్లోని 20వ పిల్లర్ వద్ద పేలుడు శబ్దం రాగా, బ్రిడ్జి కొద్ది మేరకు కుంగిన విషయం తెలిసిందే. భద్రత దృష్ట్యా బరాజ్ పైనుంచి రాకపోకలను పోలీసు అధికారులు నిలిపివేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్జైన్తోపాటు కే శర్మ, ఆర్ తంగమాణి, రాహుల్ కే సింగ్, దేవేందర్రావు, ఇద్దరు సభ్యులు కలిసి లక్ష్మీ బరాజ్ను పరిశీలించారు. ఈఎన్సీ వెంకటేశ్వర్లు బృందంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా, బరాజ్పై 20వ పిల్లర్ వద్ద కుంగిన బ్రిడ్జి ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉన్నదని, ఒక ఫీట్ కంటే ఎక్కువ కుంగలేదని అధికారులు తెలిపారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని అధికారుల బృందం బుధవారం జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో భేటీ కానున్నది. తెలంగాణ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ కమిటీ బాధ్యులు, ఈఎన్సీ నాగేంద్రరావు నేతృత్వంలో బరాజ్ను క్షేత్రస్థాయిలో సందర్శించిన బృందం రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు, కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులతో దీనిపై చర్చించనున్నది. సాంకేతిక వివరాలను అడిగి తెలుసుకోనున్నది. అనంతరం కేంద్రానికి తమ నివేదికను సమర్పించనున్నది.