హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 2024 జనవరి 21న సీటెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తెలిపింది. ఆన్లైన్లో ఈ నెల 23 వరకు సీటెట్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది 139 పట్టణాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
ఏటా పరీక్షల పట్టణాలను సీబీఎస్ఈ తగ్గిస్తూ వస్తున్నది. గతంలో రాష్ట్రంలో ఎనిమిది పట్టణాల్లో పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇదివరకు ఆరుకు కుదించారు. తాజాగా హైదరాబాద్, వరంగల్లో మాత్రమే పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థులంతా వ్యయప్రయాసలు పడాల్సి వస్తుంది. సీబీఎస్ఈ తన తీరు మార్చుకోకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.