మియాపూర్, సెప్టెంబరు 23: బీజేపీ నేతలు పేరుకు దళితుల ఇంట్లో భోజనం అంటూ వెళతారు. కానీ అక్కడ వండింది ఏమీ తినరు. సదరు ఇంటి యజమాని ఇచ్చింది ఏదీ తీసుకోరు. తమ వెంట తెచ్చుకున్న హోటలు సాపాటును తినేసి చేతులు కడుక్కోవడం వారికి పరిపాటి అయింది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ తాజా ఉదంతం కూడా ఈ కోవలోకే వస్తుంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్నగర్ డివిజన్ కృష్ణవేణినగర్లో బీజేపీ దళిత మోర్చా డివిజన్ అధ్యక్షుడు నర్సింగ్ నివాసంలో జోషి శుక్రవారం అల్పాహారం చేశారు. ఆయన వెంట బీజేపీ నేతలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, రవికుమార్ యాదవ్, నరేందర్ తదితరులున్నారు.
వారంతా కలిసి బయట హోటల్ నుంచి తెప్పించిన టిఫిన్ను మంత్రితో పాటు ఆరగించారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు మంత్రి కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు నర్సింగ్ నివాసానికి వెళ్లగా.. ఒకరిద్దరు బీజేపీ నేతలు ‘ఇది ప్రయివేటు కార్యక్రమం, మీరెందుకు వచ్చారు? బయటకు వెళ్లిపోండి’ అంటూ దురుసుగా ప్రవర్తించారు. దీనిపై మీడియా ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి నిమిషం పాటు మీడియాతో మాట్లాడి అక్కడి నుంచి నేతలతో కలిసి కొండాపూర్ దవాఖానకు వెళ్లిపోయారు. మంత్రి జోషి కారు ఎక్కేటప్పుడు కొందరు బీజేపీ నేతలు ఆయనకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించేందుకు చేతికందించగా.. ఫొటోలు దిగి దానిని తిరిగి వారికే వెనక్కి ఇచ్చేశారు. మంత్రికి ఇద్దామని తీసుకువస్తే తిరిగిచ్చేసారేమిటని బబీజేపీ నేతలు గుసగుసలాడుకున్నారు.