హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాజకీయాలను చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. క్యాబినెట్ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్రం చట్టసభలకు ఉన్న అధికారాలను కుదిస్తూ, ప్రజల అభిప్రాయాన్ని అపహాస్యం చేస్తున్నది. శాసనసభ పాస్ చేసిన బిల్లులను తిరిగి పంపిన వ్యవహారం దారుణం. దానిపైనా క్యాబినెట్లో చర్చించాం. ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించి ఆమోదించి పంపిన మూడు బిల్లులు మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్శాఖ, విద్యాశాఖవి. వీటిని గవర్నర్ వెనక్కి పంపారు.
వాటన్నింటినీ మళ్లీ అసెంబ్లీ సమావేశాల్లో పాస్ చేస్తాం. గవర్నర్కు తిరిగి పంపుతాం. రెండోసారి పాస్ చేసిన బిల్లులను గవర్నర్ ఎవరున్నా, రాజకీయంగా ఏరకమైన ఆలోచనలు ఉన్నా వాటన్నింటినీ ఆమోదించాల్సిందే. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలదే తుది నిర్ణయం. పంట నష్టానికి సంబంధించి అధికారులు ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా వేశారు. సమగ్రమైన అంచనా వేయాలని ఆదేశించాం. అయితే ఇంకా మరో రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ప్రస్తుతం పొలాల్లో పేరుకుపోయిన నీళ్లు తొలిగిపోతే గానీ నష్టం వివరాలు పూర్తిగా తెలియవు. కాబట్టి మరో రెండు, మూడు రోజుల్లో పూర్తి సమాచారం వస్తుంది.
కేంద్రం రాజకీయం చేయడం బంద్ చేసి.. సాయం చేస్తే బాగుంటుంది. ఇది వరకు ఎన్నిమార్లు ఇక్కడ వరదలొచ్చినా, ఇబ్బందొచ్చినా పైసా సాయం చేసిన పాపానపోలేదు. పైగా ఉచిత సలహాలు ఇస్తున్నది. మా ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పినా, గోడకు చెప్పినా ఒక్కటే. చెప్పి కూడా దండగే. అయినప్పటికీ మా ప్రయత్నం చేస్తాం. అయిననూ పోయి రావలెను హస్తినకు అన్నట్టు.. మేం వెళ్తాం, చెప్తాం. సాయం చేస్తే మంచిది. ఇవ్వకపోతే వాళ్ల ఖర్మ. వాళ్లను పట్టించుకునేది లేదు. కలెక్టర్లు, ఆర్డీవోలు, ఏఈవోలు, ఏవోలు, ఏడీఏలు ఇలా వ్యవసాయశాఖ, రెవెన్యూ శాఖ అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. క్షేత్రస్థాయి నుంచి పక్కా సమాచారం తీసుకుని రావాలని ఆదేశించారు’ అని వెల్లడించారు.
2024లో సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలక పాత్ర
‘మెట్రో విస్తరణకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాం. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టును పూర్తి చేస్తుంది. ఇప్పటి కేంద్రప్రభుత్వమే సహకరిస్తుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వం సహకరించకపోతే 2024లో బీఆర్ఎస్ కీలకపాత్రతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. అప్పుడైనా తెచ్చుకుంటాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ మామునూర్ ఎయిర్పోర్టు కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సాకులు చూపుతూ ఆలస్యం చేసిందని, అయినా వారు అడిగినట్టు 253 ఎకరాల భూములు ఇవ్వటానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.