హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే హైకోర్టు అమరావతిలో ఏర్పాటైందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. కర్నూలుకు తరలించాలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు.
ఈ మేరకు రాజ్యసభలో గురువారం టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు మం త్రి సమాధానం ఇచ్చారు. ఏపీ హైకోర్టు తరలింపు ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలోనే ఉన్నదని చెప్పారు. అప్పటి హైదరాబాద్ హైకోర్టు, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే దీనిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఏపీ సీఎం హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు ప్రతిపాదించారని, దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని పేర్కొన్నారు.