హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): పత్తి రైతులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి విత్తన భారం మోపింది. 2023-24 సీజన్కు పత్తి విత్తన ప్యాకెట్ల ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఒక్కో ప్యాకెట్పై రూ.43 చొప్పున ధర పెంచింది. దీంతో నిరుడు ప్యాకెట్ ధర రూ. 810 ఉండగా, ప్రస్తుతం రూ.853కు పెంచింది. తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ గెజిట్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం మూడేండ్ల నుంచి పత్తి విత్తనాల ధరను పెంచుతుండటం గమనార్హం. విత్తనాల ధర పెంపును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. ధరలు పెంచి రైతులపై భారం వేయొద్దని కోరింది. అయినా కేంద్రం రైతుల బాధలను, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను ఏ మాత్రం పట్టించుకోకుండా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
2020-21లో రూ.730గా ఉన్న ప్యాకెట్ ధర ఇప్పుడు రూ.853కు చేరింది. అంటే మూడేండ్లలో రూ.123 పెరిగింది. ఈ ఏడాది పత్తి విత్తనాల ధర పెంపుతో రాష్ట్ర రైతులపై సుమారు రూ.60 కోట్ల అదనపు భారం పడనున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో నిరుడు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ ఏడాది ఇది సుమారు 70 లక్షల ఎకరాలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో ఎకరానికి రెండు ప్యాకెట్ల విత్తనాలు అవసరం అవుతాయి. ఈ లెక్కన 70 లక్షల ఎకరాలకు 1.40 కోట్ల విత్తన ప్యాకెట్లు అవసరం అవుతాయి. ఒక్కో ప్యాకెట్పై రూ.43 ధర పెంచడంతో మొత్తం ప్యాకెట్లకు రూ.60 కోట్ల అదనపు భారం పడనున్నది.
ఎరువులు, విత్తనాల ధరలను విచ్చలవిడిగా పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం.. అదే సమయంలో రైతులకు మద్దతు ధర కల్పిండచంలో మాత్రం విఫలమవుతున్నది. గత సీజన్లో పత్తి క్వింటాల్ ధర రూ.12 వేల నుంచి రూ.7 వేల కు పడిపోయింది. ఇది మద్దతు ధర కన్నా ఎక్కువగానే ఉన్నప్పటికీ రైతుకు పెట్టుబడి ఖర్చు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో పత్తి క్విం టాల్కు రూ.10 వేల ధర నిర్ణయించాలని దేశవ్యాప్తంగా రైతులు నిరసన చేపట్టడంతోపాటు డిమాండ్ చేసినా పట్టించుకోవడంలేదు.