Cultivation cost | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): పంట పెట్టుబడి వ్యయాన్ని నిర్ధారించే విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతులను మాయ చేస్తున్నది. డీజిల్, ఎరువులు, విత్తనాల ధరలను విపరీతంగా పెంచిన కేంద్రం వ్యవసాయ పెట్టుబడి ఖర్చులను మాత్రం తక్కువ చూపుతున్నది. క్వింటాలు ధాన్యం ఉత్పత్తి వ్యయం 2020-21 నుంచి 2022-23 వరకు రూ.115 మాత్రమే పెరిగిందని కేంద్రం వెల్లడించింది. 2020-21లో రూ.1,245 ఖర్చు కాగా 2022-23 నాటికి ఇది రూ.1,360కి పెరిగినట్టు పేర్కొన్నది. ఈ లెక్కన కేంద్రం అంచనాల ప్రకారం ఎకరాకు 18 క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. దీని ప్రకారం గత మూడేండ్లలో ఎకరా వరి సాగు పెట్టుబడి వ్యయం రూ.2,070 పెరిగినట్టు కేంద్రం లేక్క తేల్చింది. వాస్తవానికి ఎకరా వరి సాగు పెట్టుబడి వ్యయం రూ.5-7 వేల వరకు పెరిగింది. మూడు నాలుగేండ్ల క్రితం ఎకరా వరి సాగుకు రూ.25 వేల వరకు ఖర్చు కాగా ప్రస్తుతం రూ.30-32 వేలు దాటింది.
కేంద్రం లెక్కలకు, వాస్తవ ఖర్చులకు పొంతనే లేదు
సాగు ఖర్చుల విషయంలో కేంద్రం లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు పొంతనే లేదు. గత మూడు, నాలుగేండ్లలో ఏ స్థాయిలో డీజిల్, ఎరువుల ధరలు పెరిగాయో వాటిని పెంచిన కేంద్ర ప్రభుత్వానికి తెలియంది కాదు. 2020-21 జూన్లో లీటర్ డీజిల్ ధర రూ.67.82 ఉండగా ప్రస్తుతం రూ.97.82కు చేరింది. మూడేండ్లలో లీటర్ డీజిల్ ధర రూ.30 పెరిగింది. కూలీల రేట్లు గతంలో రూ.200 వరకు ఉండగా ప్రస్తుతం రూ.300-500 వరకు పెరిగాయి. పొటాష్ ఎరువు ధర బస్తాకు రూ.850 నుంచి రూ.1,700కు పెరిగింది. ఈ విధంగా ప్రతి విషయంలోనూ పెట్టుబడి ఖర్చు పెరిగింది. కేంద్రం ఇవేవి పరిగణనలోకి తీసుకోకుండా పెట్టుబడి ఖర్చును నిర్ణయించి దీని ఆధారంగా మద్దతు ధరను ఖరారు చేస్తున్నది. మద్దతు ధరలో శాస్త్రీయత లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రైతుకు మిగిలేది స్వల్పమే
పెట్టుబడి వ్యయం, మద్దతు ధరను పోల్చితే రైతుకు మిగిలేది స్వల్పమే. 2022-23 సంవత్సరానికి కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం క్వింటా ధాన్యం ఉత్పత్తికి అయ్యే వ్యయం రూ.1,360. దీని ప్రకారం ఎకరాకు సగటున 18 క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి అవుతుందనుకుంటే.. ఎకరా వరి సాగుకయ్యే వ్యయం రూ.24,480. కేంద్రం క్వింటా ధాన్యం మద్దతు ధరను రూ.2,040గా నిర్ణయించింది. ఈ లెక్కన ఎకరాలో పండించిన ధాన్యం విక్రయిస్తే రైతుకు రూ.36,720 ఆదాయం వస్తుంది. ఇందులో పెట్టుబడి ఖర్చు రూ.24,480 తీసేస్తే రైతుకు ఎకరాకు రూ.12,240 మిగులుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం. కానీ వాస్తవ పరిస్థితుల ప్రకారం పెట్టుబడి ఖర్చు రూ.30-32 వేల వరకు అవుతున్నది. ఈ లెక్కన రైతుకు మిగిలేది ఎకరాకు కేవలం రూ.4-6 వేలు మాత్రమే.