RRR | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) నిర్మాణం కోసం ఇంతకాలం భూసేకరణకు అయ్యే ఖర్చులో సగం భరించాలని పట్టుబట్టిన కేంద్ర జాతీయ రహదారులశాఖ, ఇప్పుడు యుటిలిటీ షిఫ్టింగ్ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ కొర్రీ పెడుతున్నది. ఇందుకోసం రూ.350 కోట్లు ఖర్చవుతుందని, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలంటూ ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడ్డుపుల్ల వేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ అంశంపై కేంద్రానికి అన్ని వివరాలతో వినతి పత్రం సమర్పించినా ఇప్పటికీ సానుకూల స్పందన రాలేదు.
భారత్మాలా పరియోజనలో భాగంగా 340 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల రీజినల్ రింగ్ రోడ్డు సంగారెడ్డి, తూప్రాన్, చౌటుప్పల్, ఆమన్గల్, శంకరపల్లి తదితర పట్టణాల గుండా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భూసేకరణకు రూ.5,300 కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా కాగా, ఇందులో సగభాగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తేనే ప్రాజెక్టును చేపడతామని కేంద్రం మెలికపెట్టింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించి, అందులో రూ.100 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ఇప్పుడు యుటిలిటీ (కరెంటు స్తంభాలు, టెలికం లైన్లు తదితర) షిఫ్టింగ్కు అయ్యే రూ.350 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ కేంద్ర రహదారుల శాఖ మెలికపెట్టింది. రోడ్డు నిర్మాణ ఖర్చును టోల్ ట్యాక్స్, పెట్రోల్ సెస్ రూపంలో కేంద్రమే వసూలు చేసుకుంటుంది కాబట్టి యుటిలిటీ షిఫ్టింగ్ భారాన్ని కూడా కేంద్రమే భరించాలని కేంద్ర రహదారుల శాఖ కార్యదర్శికి సీఎస్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంపై ఆర్థిక భారం మోపాలన్న దురుద్దేశమే!
భూసేకరణకు అయ్యే ఖర్చులో సగం మొత్తాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నా, ఇప్పుడు యుటిలిటీ షిఫ్టింగ్ అంటూ ఇప్పుడు కేంద్రం మరో భారాన్ని మోపుతున్నది. రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చును టోల్ ట్యాక్స్, పెట్రో సెస్ రూపంలో సమకూర్చుకొనే కేంద్ర మే..ఈ మొత్తాన్నీ భరించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.