ఉపాధి హామీలో చేపట్టిన నీటి సంరక్షణ పనుల్లో జాతీయస్థాయిలో రెండోస్థానం.. ఎక్కువ పనిదినాలు కల్పించి, లక్ష్యాలను చేరుకోవటంలో అత్యున్నత ప్రతిభ ప్రదర్శించాయంటూ సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు అవార్డులు.. ఇవి 2019 నాటివి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో ఉపాధి పనులకు ఏటా అవార్డులు, కేంద్రం బృందాల ప్రశంసలు నిత్యకృత్యమయ్యాయి. దేశంలో ఎక్కువ పనిదినాలు కల్పిస్తున్నదీ ఇక్కడే. అందుకేనేమో కేంద్రంలోని బీజేపీకి కన్నుకుట్టింది. రైతులకు లాభం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలను, కల్లాలను ఉపాధి హామీ పనుల్లో భాగంగా నిర్మించడాన్ని తప్పు పడుతున్నది.
రైతుల ప్రశ్నలు
1) రైతులకు లబ్ధి చేకూరేలా రైతు వేదికలు నిర్మించడం తప్పా?
2) పంటను ఆరబెట్టుకోవడానికి కల్లాలు నిర్మించడం నేరమా?
3) భూగర్భజలాలు పెరిగేలా చెరువుల్లో పూడికలు తీయడం, కందకాలు తవ్వడం ఎలా తప్పవుతుంది?
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని కోరితే పట్టించుకోని కేంద్రం తెలంగాణను బోనులో నిలబెట్టేందుకు అనేక అక్రమ మార్గాలు వెతుకుతున్నది. కేంద్రం దృష్టి ఇప్పుడు అదే ఉపాధిహామీ పనులపై పడింది. రైతులకు ప్రయోజనం కల్పించేందుకు చేపట్టిన పనులు సరికాదంటున్నది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ బృందం గత నెల 9-12 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీలో భాగంగా నిర్మించిన రైతు వేదికలు, కల్లాల నిర్మాణాలు, చిన్నతరహా నీటి చెరువుల్లో పూడికతీత, మైదాన ప్రాంతాల్లో కందకాల పనులను తప్పుబట్టింది. రెండో విడతగా 15 జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘అమ్మ పెట్టదు…’అన్నట్టుగా రైతులకు మేలు చేయడం చేతగాని కేంద్రం, అన్నదాతలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అనేక సంస్కరణలతో రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగగా మార్చిన ప్రభుత్వం, రైతులు చర్చించుకొనేందుకు, ప్రభుత్వ అధికారులు నేరుగా రైతులతో మాట్లాడేందుకు ఒక నీడను నిర్మించడం ఎలా తప్పవుతుందని నిలదీస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆహార ధాన్యాలు ఆరబెట్టుకోవడానికి కల్లాలు నిర్మించడం నేరమవుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడి ఫలితాలను చూసి, తెలంగాణను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా అమలుచేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కేంద్రం ఉపాధి హామీ సాఫ్ట్వేర్లో మార్పులు చేసి కూలీలకు డబ్బులు సైతం ఢిల్లీ నుంచే వేస్తున్నది. ఇలాంటి తరుణంలో ఇప్పటికే పూర్తయ్యి, రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్న పనులను తప్పుబట్టడం తెలంగాణపై కక్షసాధింపుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.