సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ), అడ్వయిజరీ కమిటీతోపాటు పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం పొందితేనే జాతీయ హోదా ఇచ్చేందుకు ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటుచేస్తాం. ఆ కమిటీ సిఫారసు చేసినా నిధుల లభ్యతను బట్టి కేంద్రం జాతీయ హోదా ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లేనందున జాతీయహోదాకు అర్హత లేదు.
– పార్లమెంట్లో కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మహా కుట్ర పార్లమెంటు సాక్షిగా బయటపడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏ దరఖాస్తు చేసుకొన్నా ఏండ్లపాటు ఎటూ తేల్చకుండా నానబెట్టడం, చివరకు అనుమతులు లేవంటూ అడ్డదిడ్డంగా మాట్లాడటం.. ఇదే ఇప్పుడు మోదీ సర్కారు నడిపిస్తున్న ప్రమాదకర కుట్ర. కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వటం లేదని పార్లమెంటులో ఎదురైన ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు ఇచ్చిన సమాధానం.. ‘ఆ ప్రాజెక్టుకు ఇప్పటికీ పెట్టుబడి అనుమతులు లేవు’ అని. ఇదే అసలు కుట్ర..
కేంద్రం ఏమన్నది?
తెలంగాణలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా కోరుతూ రాష్ట్ర సర్కారు నుంచి ఏదయినా ప్రతిపాదన వచ్చిందా? అని పార్లమెంట్లో ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి గురువారం అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్ 2016 ఫిబ్రవరిలో, 2018 డిసెంబర్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే ఏదయినా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటే దానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తప్పనిసరి. ఆ తరవాత ప్రాజెక్టు పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా ఆమోదం ఉండాలి. దాని తరవాతే ప్రాజెక్టుకు జాతీయ హోదాపై స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి. హోదా ఇవ్వాలని అది సిఫారసు చేసినా నిధుల లభ్యతను బట్టి కేంద్రం జాతీయ హోదా ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకొంటుంది’ అని పేర్కొన్నారు.
జాతీయహోదాను అడ్డుకొనేందుకే..
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా కేంద్ర ఆది నుంచీ కుటిల పన్నాగాలు పన్నుతున్నది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు విధానాలు మార్చుకొంటున్నది. నిజానికి జాతీయ హోదా కోసం కేంద్రం విధించిన అన్ని మార్గదర్శకాలకు కాళేశ్వరం ప్రాజెక్టు సరితూగుతుంది. అయినప్పటికీ జాతీయ హోదా ఇవ్వకపోవడమేగాక, ఎప్పటికీ హోదా రాకుండా అడ్డుకొనేందుకు కుట్రలకు తెరలేపిందని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో పోలవరం, ఉత్తరప్రదేశ్లో కెన్-బెత్వా, కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటించింది. వీటన్నింటికంటే పెద్దదయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం హోదా ఇవ్వకుండా తొక్కిపెట్టింది. కాళేశ్వరమే కాకుండా తెలంగాణలోని ప్రతి నీటిపారుదల ప్రాజెక్టుపై మోదీ సర్కారు ఏదో ఒక వివాదం సృష్టిస్తున్నదని ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు. గోదావరిపై ఉన్న అనుమతిలేని 11 ప్రాజెక్టులకుగాను, ఆరింటిపై పూర్తిస్థాయి నివేదికలను సీడబ్ల్యూసీకి, జీఆర్ఎంబీకి తెలంగాణ సర్కారు గత సెప్టెంబర్లోనే సమర్పించింది. ఇప్పటికీ వాటికి అనుమతులివ్వకుండా సీడబ్ల్యూసీ కాలయాపన చేస్తున్నది. నీటి లభ్యత పుష్కలంగా ఉన్నదని కేంద్ర జల్శక్తి శాఖ చెప్పిన సీతారామ, తుపాకులగూడెం ప్రాజెక్టులకు కూడా సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వలేదు.
కాళేశ్వరంపై కేంద్రానికి విజ్ఞప్తులు
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని 2016 ఫిబ్రవరి11న ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖను రాశారు.
2016 ఆగస్టు 7న మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధానికి వేదికపైనే మరోసారి విజ్ఞప్తి.
2018, ఆగస్టు 5న పీఎం మోదీకి సీఎం కేసీఆర్ మరో లేఖ రాశారు. ప్రాజెక్టు నిర్మాణానికి కనీసం రూ.20 వేల కోట్లు ఇవ్వాలని కోరారు.
2018, డిసెంబర్ 26న ఢిల్లీలో మోదీని కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు.
2018, జూలై 18న అప్పటి ఇరిగేషన్ శాఖ హరీశ్రావు స్వయంగా జల్శక్తి శాఖ మంత్రిని కలిసి హోదాపై విజ్ఞప్తి.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీలు అనేకమార్లు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అసలు నిజం ఇదీ..
దేశంలో ఎక్కడ నీటిపారుదల ప్రాజెక్టు కట్టాలన్నా డిజైన్, పర్యావరణం, పెట్టుబడులు తదితర అంశాలపై అనుమతులు అవసరం. ఇవి ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే. బృహత్ ప్రయోజనాలున్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాల అనుమతులకు దరఖాస్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కూడా కోరింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రే పార్లమెంటులో స్వయంగా చెప్పారు. అయితే, ఏ ప్రాజెక్టు విషయంలోనూ పట్టించుకోని అంశాలను ఎత్తిచూపుతూ, వాటినే రిమార్కులుగా చూపుతూ నాలుగేండ్లుగా పెట్టుబడి అనుమతులు ఇవ్వకుండా కేంద్రం తొక్కిపెట్టింది. ఇది కూడా వాస్తవం. అంతరాష్ట్ర అంశాలు, భారీ పెట్టుబడితో ముడిపడి ఉన్న ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం పరిధిలోని దాదాపు 10 డైరెక్టరీలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రం సాధించని విధంగా తెలంగాణ సర్కారు ఏడాదిన్నర కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించింది. 2018లో టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) అనుమతి సాధించిన వెంటనే ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కోసం సీడబ్ల్యూసీకి దరఖాస్తు సమర్పించింది.
అక్కడి నుంచి అది నీతి అయోగ్ పరిధిలోని ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీ పరిశీలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే నాలుగేండ్లుగా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వకుండా కేంద్రం సీడబ్ల్యూసీ ద్వారా అనేక కొర్రీలు పెట్టిస్తున్నది. ఏ ప్రాజెక్టుకూ పరిగణనలోకి తీసుకోని అంశాలను కాళేశ్వరం విషయంలో పరిశీలిస్తూ కాలయాపన చేస్తున్నది. ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్ బృందం నాలుగేండ్లుగా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కోసం ఢిల్లీకి చక్కర్లు కొడుతూనే ఉన్నది. అయినా సీడబ్ల్యూసీ తొక్కిపెట్టింది. ఇప్పుడు అనుమతులు లేవని, అందుకే జాతీయహోదా ఇవ్వలేదని కేంద్రం ప్రకటించడంపై ఇంజినీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.