హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): మహిళా సాధికారతలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. శుక్రవారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ కవిత ప్రధాని మోదీ విధానాలను దుయ్యబట్టారు. ప్రధాని మోదీ సహా మంత్రులు, బీజేపీ నేతలు మహిళా సాధికారత కోసం ఏమీ చేయకపోయినా చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవటం మానుకోవాలని హితవు పలికారు.
దిగువ మధ్యతరగతి మహిళలను నేరుగా ప్రభావితం చేస్తున్న ధరల పెరుగుదలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ తన ఎనిమిదేండ్ల పాలనలో మహిళాలోకానికి ఏం చేశారని నిలదీశారు. ‘బేటీ బచావో..బేటీ పఢావో’ వంటివి అందమైన నినాదాలుగానే మిగిలిపోతున్నాయని ధ్వజమెత్తారు. కరోనా కష్టకాలంలో క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు పౌష్టికాహార పంపిణీలో తీవ్రంగా కృషి చేశారని, మహిళల ఆరోగ్యరక్షణ కోసం పాటుపడ్డారని గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న అంగన్వాడీల బడ్జెట్ను 50 శాతం కుదించినందుకు మోదీ సర్కార్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.