హైదరాబాద్, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ) : శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 17న భద్రాచలంలో నిర్వహించే సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కేంద్రం ఎన్నికల సంఘం నిరాకరించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 4న లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని కోరుతూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు.
ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు : సజ్జనార్
భద్రాచలం రాములోరి తలంబ్రాలను ఆన్లైన్లో బుక్ చేసుకొనే సదుపాయాన్ని టీఎస్ ఆర్టీసీ కల్పించింది. భక్తులు http://tsrtclogistics.in వెబ్సైట్ను సంప్రదించి.. తలంబ్రాలను ఆర్టీసీ ద్వారా ఇంటి దగ్గర పొందవచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ సోమవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆఫ్లైన్లో కూడా తలంబ్రాలను పొందేందుకు 040-23450033, 040-69440000, 040-69440069 నంబర్లను సంప్రదించాలని సూచించారు.