హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వల్ల నష్టపోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) అమలులో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్షను ప్రదర్శించింది. బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణకు దక్కిన రుణాలు అతితక్కువగా ఉండడమే ఇందుకు నిదర్శనం. ఈ వివరాలను స్వయానా కేంద్ర ప్రభుత్వమే సోమవారం రాజ్యసభలో వెల్లడించింది. ఆ లెక్కల ప్రకారం.. ఈసీఎల్జీఎస్ కింద దేశవ్యాప్తంగా 37 రాష్ర్టాల్లో మొత్తం 1,13,47,107 ఎంఎస్ఎంఈలకు రూ.2,37,702.81 కోట్ల రుణాలిచ్చారు. తెలంగాణలో కేవలం 1,18,371 ఎంఎస్ఎంఈలకు రూ.9,465.99 కోట్ల మేరకు మాత్రమే ఈ రుణ సాయం లభించింది. వాటిలో 88,992 సూక్ష్మ పరిశ్రమలకు రూ.2,693.21 కోట్లు, 21,097 చిన్న పరిశ్రమలకు రూ.3,940.39 కోట్లు, 8,282 మధ్యతరహా పరిశ్రమలకు రూ.2,832. 39 కోట్ల రుణాలు ఇచ్చినట్టు కేంద్రం పేర్కొన్నది.
తెలంగాణలో దాదాపు 26 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. వాటిపై ఆధారపడి లక్షల మంది జీవిస్తున్నారు. కొవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో అవి యథావిథిగా పనిచేశాయి. కానీ, ఇతర రాష్ర్టాల్లో లాక్డౌన్ల వల్ల తెలంగాణలోని ఎంఎస్ఎంఈలకు ముడిసరుకు సరిగా రవాణా కాలేదు. అలాగే తెలంగాణలోని ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను రవాణా చేయడంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసీఎల్జీఎస్ నిబంధనలను సరళతరం చేసి సాధ్యమైనంత ఎక్కువ ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ), తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్) పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది.