హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రైతుల నుంచి నాణ్యమైన ధాన్యమే కొనుగోలు చేస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ స్పష్టంచేశారు. రాబోయే యాసంగి నుంచి దొడ్డు బియ్యం కొనేది లేదని భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) ప్రకటించడం పట్ల తెలంగాణ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. శుక్రవారం ఆయన మాదాపూర్ హెచ్ఐసీసీలో భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్), భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐఐఎంఆర్), ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయసంస్థ(ఎఫ్ఏవో), కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు నిర్వహించే పోషకధాన్యాల మహా సమ్మేళనం-3.0ను లాంఛనంగా ప్రారంభించారు. దేశ ప్రజల ఆహారభద్రతతోపాటు పోషకాహార భద్రతకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. ప్రత్యేక మిషన్ ద్వారా దేశంలో చిరుధాన్యాలు, ఆయిల్పామ్ సాగుకు భారీ ఎత్తున రాయితీలిచ్చి ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. దీనివల్ల ఆయిల్పామ్, నూనెగింజల సాగుకు అనుకూల భూములున్న తెలంగాణ రైతులకు కూడా మేలు జరుగుతుందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంపుదల, ఒప్పందసేద్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు. వంటనూనెల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంపుదలతోపాటు అదనపు విలువ జోడింపు, ప్యాకింగ్, బ్రాండింగ్, మారెటింగ్, విదేశీ ఎగుమతులను ప్రోత్సహించేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. దేశంలో పదివేల రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీవో)ను ఏర్పాటుచేసి, రూ.6,850 కోట్లు వెచ్చిస్తున్నామని, పంటలకు గిట్టుబాటు ధరలు, ప్రాసెసింగ్, మారెటింగ్ సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. మహాసమ్మేళనం ప్రారంభించడానికి ముందు ఆయన వివిధ స్టార్టప్లు, చిరుధాన్యాల ప్రాసెసింగ్ సంస్థలు ఏర్పాటుచేసిన ఫుడ్స్టాళ్లను సందర్శించారు. అనంతరం ఐసీఏఆర్, ఐఐఎంఆర్ ప్రచురణలను ఆవిషరించారు. ఐఐఎంఆర్ ఏర్పాటుచేసిన న్యూట్రీ సిరియల్ సెంటర్, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్, గ్లాస్హౌజ్ రీసెర్చ్ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులు సంజయ్ అగర్వాల్, డాక్టర్ శేఖర్ సీ మండే, డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర, కేంద్ర ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టీఆర్ శర్మ, న్యూట్రీహబ్ సీఈవో బీ దయాకర్రావు, శాస్త్రవేత్త విశారద తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మేళనంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, అసోం, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. శనివారం ముగింపు సభలో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పాల్గొంటారని ఐఐఎంఆర్ వర్గాలు తెలిపాయి. ఐక్యరాజ్యసమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాలలో ఇది మూడోది.
ఆయిల్పామ్ విత్తనాలపై కస్టమ్స్ సుంకం తగ్గించండి: సీఎస్
ఆయిల్పామ్ విత్తనాల దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రాన్ని కోరింది. శుక్రవారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సోమేశ్కుమార్ ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగు చేపట్టనున్నట్టు సీఎస్ వివరించారు. నాణ్యమైన ఆయిల్పామ్ విత్తనాలు లభించేలా చూడాలని కోరారు. ఇదే కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ను సీఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో వ్యవసాయరంగంలో చేపట్టిన పలు కార్యక్రమాలు, ఆయిల్పామ్ సాగు విశేషాలను కేంద్ర మంత్రికి వివరించారు.