హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ): వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తున్నామని, కేంద్రం వాటా సున్నా అని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. అయినా బీజేపీ నేతలు దవాఖాన నిర్మాణంలో కేంద్రం వాటా ఉన్నట్టు చౌకబారు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 24 అంతస్తులు, రెండువేల పడకలతో అత్యాధునిక పద్ధతుల్లో నిర్మిస్తున్న ఈ దవాఖాన తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ అని వివరించారు. ఇది త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దవాఖాన నమూనా చిత్రం, క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్మాణ పనులకు సంబంధించిన ఫొటోలను ఆదివారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
సత్ఫలితాలిస్తున్న ట్రామా సెంటర్లు
ఔటర్ రింగ్రోడ్డు(ఓఆర్ఆర్)పై ఏర్పాటుచేసిన ట్రామా సెంటర్లు సత్ఫలితాలిస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఔటర్పై ప్రమాదాలబారిన పడుతున్నవారికి వీటి ద్వారా సత్వరమే వైద్యసేవలు అందుతుండడంపై హర్షం వ్యక్తంచేశారు. వీటిద్వారా ఎంతోమందికి మేలు జరుగుతున్నదని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఓఆర్ఆర్పై 16 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయగా, వాటి ద్వారా ఇప్పటివరకు 1,098 మంది వైద్యసేవలు పొందినట్టు వెల్లడించారు. ఔటర్పై ప్రమాదాలు జరిగినప్పుడు 14449 టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచించారు.