హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు తట్టుకొని ఆరుగాలం శ్రమించి పత్తి పండిస్తున్న రైతుకు కేంద్రం విధానాలు శాపంగా మారాయి. చక్కటి ధర వస్తుందని ఆశిస్తే చివరకు పెట్టిన పెట్టుబడి వచ్చేలా కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పత్తి ధరలు పడిపోతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్వింటాలుకు రూ.10 వేలకు పైగా పలకాల్సి ఉండగా కేంద్రం నిర్వాకం వల్ల రూ.7,500 వరకే చెల్లిస్తున్నారు. ఇది మద్దతు ధర కన్నా ఎక్కువే అయినప్పటికీ తమకు గిట్టుబాటు కావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిగుమతి సుంకం ఎత్తివేతతో పతనం
ఈ ఏడాది ఆరంభంలో విదేశాల నుంచి దిగుమతి అయ్యే పత్తికి కేంద్ర ప్రభుత్వం సుంకం రద్దు చేసింది. దీనివల్ల విదేశాల నుంచి సరుకు వస్తుండటంతో రాష్ట్రంలో ధరలు క్రమంగా పతనమవుతున్నాయి. ఏడాది మొదట్లో దేశవ్యాప్తంగా పత్తికి భారీ ధర పలికింది. క్వింటాలు రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు అమ్ముడుపోయింది. వర్షాలు ఆలస్యంగా రావడం, పంట నెమ్మదిగా వస్తుండటంతో వ్యాపారులు విదేశాల కాటన్ దిగుమతిపై దృష్టి పెట్టారు. కాటన్ ఇండస్ట్రీ విజ్ఞప్తి మేరకు విదేశాల నుంచి పత్తి దిగుమతిపై గతంలో విధించిన 11 శాతం సుంకాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. దీంతో వ్యాపారులు విదేశాల నుంచి భారీగా పత్తిని కొనుగోలు చేశారు. సుమారు 25-30 లక్షల బేళ్ల పత్తి దిగుమతి చేసుకొన్నట్టు సమాచారం.
ఈ ప్రభావం ఇప్పుడు దేశీయ రైతులపై తీవ్రంగా పడుతున్నది. వ్యాపారుల వద్ద పత్తి భారీగా ఉండటం, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొంత డిమాండ్ తగ్గడంతో అధిక ధర ఇచ్చేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని రైతులు చెబుతున్నారు. మంచి ధర వస్తుందని ఆశతో సాగు చేస్తే చివరకు పెట్టబడి, కూలీ ఖర్చులు కూడా రావడం లేదని లబోదిబోమంటున్నారు. విదేశాల నుంచి పత్తి దిగుమతిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ధరలు తగ్గడంతో చాలావరకు రైతులు పత్తిని విక్రయించకుండా ఇండ్లల్లోనే నిల్వ చేసుకొంటున్నారు.
మద్దతు ధర పెంచాలి
సాగు ఖర్చు నానాటికీ పెరుగుతున్నది. ఎకరం విస్తీర్ణంలో పత్తి సాగు చేసేందుకు రూ.25-30 వేల వరకు వ్యయం అవుతుండగా, దిగుబడి 3-5 క్వింటాళ్ల వరకు వస్తున్నది. కేంద్రం మద్దతు ధర క్వింటాలుకు రూ. 6080 నిర్ణయించడంతో పెట్టుబడి ఖర్చులు కూడా రాని దుస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం, నిరంతరం ఉచిత విద్యుత్తు ఇస్తూ అన్నదాతకు అండగా ఉంటున్నా కేంద్రం వైఖరి వల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో పత్తి మద్దతు ధర కనీసం రూ.10 వేలు ఇవ్వాలని, విదేశాల నుంచి పత్తి దిగుమతులపై పూర్తిగా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.