హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది యాసంగి, వానకాలం సీజన్లలో రాష్ట్రం నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ బియ్యాన్ని సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ చెల్లించి ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు.