హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది. భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్న దేశంలో ఫెడరల్ స్పూర్తి పరిఢవిల్లాలని సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి కీలక ఫలితం దకింది. సీఎం కేసీఆర్ డిమాండ్ మేరకు ఇకనుంచి పోటీ పరీక్షలను అన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. రైల్వే, డిఫెన్స్, బ్యాంకింగ్ తదితర కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోటీ పరీక్షలను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే నిర్వహించడం సరికాదని, ప్రాంతీయ భాషల్లోనూ వీటిని నిర్వహించి, దేశవ్యాప్తంగా నిరుద్యోగులు నష్టపోకుండా చూడాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్రం సానుకూలంగా స్పందించింది. సీఎం కేసీఆర్ డిమాండ్ మేరకు హిందీ ఇంగ్లిష్తోపాటు రాజ్యాంగం 8వ షెడ్యూల్లో పొందుపరిచిన అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయించింది. దీంతో ఆయా రాష్ర్టాల్లో గ్రూప్ 1, 2, 3 ఎస్సై, కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రయోజనం చేకూరనున్నది.
సాధారణంగా కేంద్రం గ్రూప్-బీ, గ్రూప్-సీ క్యాటగిరీల్లోని ప్రభుత్వ ఉద్యోగాలను ఎక్కువగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ద్వారా భర్తీ చేస్తుంది. ఇప్పటివరకు ఈ పరీక్షలను హిందీ, ఇంగ్ల్లిష్ మీడియంలో మాత్రమే నిర్వహిస్తున్నారు. దీనితో దక్షిణాది రాష్ర్టాల అభ్యర్థులు తక్కువగా సెలక్ట్ అయ్యేవారు. భాష కారణంతోనే యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోకూడదనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ 2020 నవంబర్ 18న ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘ప్రస్తుతం కేంద్రం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, రైల్వే, డిఫెన్స్ సర్వీసెస్, బ్యాంకింగ్ మొదలైన ఉద్యోగ నియామకాల కోసం అన్ని పోటీ పరీక్షలను హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో మాత్రమే నిర్వహిస్తున్నది.
దీంతో ఇంగ్లిష్ మీడియం చదవని, హిందీ మాట్లాడే రాష్ర్టాలకు చెందని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాల విద్యార్థులకు ఉద్యోగాల్లో సమానమైన, న్యాయమైన అవకాశాలు దక్కాల్సిన అవసరం ఉన్నది. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ తదితర కమిషన్లు నిర్వహించే పరీక్షలు తెలుగుతోపాటు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలి. అప్పుడే దేశంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం దక్కినట్టు అవుతుంద’ని అని సీఎం కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై కేంద్రం ఎట్టకేలకు స్పందించింది. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల్లోని గ్రూప్-బీ, గ్రూప్-సీ ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పరీక్షలను హిందీ, ఇంగ్లిష్తోపాటు మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని ప్రకటించింది. దీనిని మల్టీ టాసింగ్ (నాన్టెక్నికల్), స్టాఫ్ ఎగ్జామ్ (ఎమ్టీఎస్) పరీక్షల్లో అమలు చేయనున్నట్టు వెల్లడించింది.
ఇకపై స్టాఫ్ సెలక్షన్ పరీక్షలను హిందీ, ఇంగ్లిష్తోపాటు తెలుగు, ఉర్దూ, తమిళ్, మలయాళం, కన్నడ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కొంకణి, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ భాషల్లోనూ నిర్వహిస్తామని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లశాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ చొరవతో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా భాషాభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్కు దేశవ్యాప్తంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలను ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో మాత్రమే నిర్వహించడంతో ఉద్యోగాలు ఎక్కువగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల అభ్యర్థులకే దక్కేవి. ప్రత్యేకించి దక్షిణాది రాష్ర్టాల అభ్యర్థులకు నష్టం కలిగేది. ఎస్ఎస్సీ పరీక్షలు తెలుగుతోపాటు మిగిలిన ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని టీ-శాట్ ఏడేండ్లుగా పోరాడుతున్నది. విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన 2020లోనే ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సైతం కేంద్రానికి లేఖ రాశారు. ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చింది. ప్రాంతీయ భాషల్లో ఎస్ఎస్సీ పరీక్షలు నిర్వహించడం వల్ల కొన్నికోట్ల మంది యువతకు లబ్ధి చేకూరుతుంది. ప్రత్యేకించి, తెలంగాణ యువతకు ఇకపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇది చరిత్రాత్మకం.
– శైలేశ్రెడ్డి, టీ శాట్ నెట్వర్క్ సీఈవో