పేరు పీఎం కేర్స్ ఫండ్.. కానీ ప్రభుత్వానికి దీనికి ఏ సంబంధం లేదట! ప్రభుత్వరంగ సంస్థల నుంచి మాత్రం ఈ నిధికి భారీ ఎత్తున విరాళాలు వచ్చిపడ్డాయి. కరోనా బాధితులను ఆదుకునేందుకు ఉపయోగిస్తారని అంతా భావించారు. మానవత్వంతో స్పందించారు. కానీ ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడిన నిధుల్లో కనీసం 50 శాతం కూడా ఖర్చు చేయలేదు. ఇదేమని నిలదీస్తే.. అసలు ఆ ఫండ్ ప్రభుత్వానిదే కాదని కేంద్రం బుకాయిస్తున్నది. ప్రైవేటీకరణ బూచి చూపి దిగ్గజ కంపెనీల ముక్కుపిండి వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి.
PM Cares fund | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కరోనా బాధితులకు సాయం చేస్తామంటూ ప్రధాని నరేంద్రమోదీ 2020 మార్చిలో ప్రారంభించిన ‘పీఎం కేర్స్’ ఫండ్పై వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వరంగానికి చెందిన దిగ్గజ కంపెనీలు (పీఎస్యూలు) మూడేండ్ల వ్యవధిలోనే ఈ ఫండ్ కోసం రూ. 2,913 కోట్లు విరాళంగా ఇచ్చినట్టు తేలింది. ఇంగ్లిష్ పత్రిక బిజినెస్ స్టాండర్డ్ ఈ సంగతి ప్రచురించింది. 2019-20 నుంచి 2021-22 మధ్య ఈ నిధులను సమకూర్చినట్టు వెల్లడించింది. పీఎం కేర్స్కు విరాళాలను ఇచ్చిన పీఎస్యూల జాబితాలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) ఉన్నాయి.
వివాదాల పుట్ట
కరోనా బాధితుల సాయం కోసమంటూ విరాళాలు సేకరించి ఖర్చు మాత్రం చేయట్లేదంటూ ‘పీఎం కేర్స్’ ఫండ్పై ఇప్పటికే పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఫండ్ ఏర్పాటు చేసి మూడేండ్లు కాగా.. రూ.23 వేల కోట్ల వరకు విరాళాలు వచ్చాయి. అందులో 50 శాతం కూడా ఖర్చు చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం పలు సందర్భాల్లో ఆడిట్ రిపోర్టుల్లో తేలింది. అంతేకాకుండా, పీఎం కేర్స్ ఫండ్ విరాళాలు, ఖర్చుల వివరాల వెల్లడిని ఎప్పటికప్పుడు తాత్సారం చేస్తూ వస్తున్న కేంద్రప్రభుత్వం.. అసలు ఆ ఫండ్ ప్రభుత్వానిదే కాదని ఢిల్లీ హైకోర్టుకు ఇటీవల ఓ అఫిడవిట్లో తెలిపింది.
కాగా, పీఎం కేర్స్ ఫండ్కు పీఎస్యూలు పెద్దయెత్తున విరాళాలు ఇవ్వటంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ జాబితాలో చేర్చిన కంపెనీలు ఈ ఫండ్కు విరాళాలు ఇవ్వడానికి ప్రభుత్వ ఒత్తిళ్లే కారణమై ఉండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. విరాళాలు ఇవ్వాలంటూ నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో లిస్ట్ అయిన ఈ కంపెనీలపై కేంద్రప్రభుత్వమే ఒత్తిళ్లు తీసుకురావొచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.