నల్లగొండ : తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ప్రవర్తిస్తుందని మాజీ శాసనమండలి చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు చిట్యాలలో సోమవారం నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నిరసన ర్యాలీలో రైతులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పండించిన ధాన్యాన్ని కొనే విషయంలో రైతులు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆందోళన చేసినా కేంద్రం తీరు మారడం లేదన్నారు. రైతు ఉద్యమాల కారణంగా రద్దయిన మూడు రైతు వ్యతిరేక చట్టాలతో పాటు కరెంటు బిల్లుల పెంపు, వ్యవసాయ మోటర్లకు మీటర్ల బిగింపు చట్టాలను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం పన్నే కుట్రలో బలికాకుండా తెలంగాణ రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు ప్రకారం వరికి బదులు ఇతర పంటలను పండించాలని అన్నదాతలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను బెదిరించి తన వైపు తిప్పుకోవాలని చూస్తోందని ఆరోపించారు.