రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు మండలం ఆకుల మైలారంలో రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. కేంద్రం యాసంగిలో పంట కొనుగోలు చేయమని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి తెలంగాణ రైతులకు నట్టేట ముంచుతుందని మండిపడ్డారు. రైతులు యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు వేసి నష్టపోకుండా ఉండాలని సూచించారు.
ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరో 30 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతుల వద్ద ఉంది. కేంద్రం మాత్రం ఇప్పటి వరకు తీసుకుంది నామమాత్రమే అన్నారు. బీజేపీ నేతలు ఢిల్లీలో ఒక లాగా, గల్లీలో మరోలాగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
తెలంగాణ రైతుల కోసం పూర్తి ధాన్యం కొనుగోలు చేసేలా ముందు కేంద్రాన్ని ఒప్పించాలి. లేదంటే బీజేపీకి తెలంగాణలో స్థానం లేకుండా చేస్తారన్నారు. రైతులకు అండగా దేశ చరిత్రలో ధర్నా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్నారు.