TS Inter Exams | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): మీరు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారా? ఎగ్జామ్ సెంటర్ తెలియదని టెన్షన్ పడుతున్నారా? సెంటర్ లొకేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, గూగుల్ప్లే స్టోర్ నుంచి ‘సెంటర్ లొకేటర్’ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీ ఎగ్జామ్ సెంటర్ నెంబర్ ఎంటర్ చేయండి.. ఈజీగా పరీక్షా కేంద్రానికి చేరుకోండి.. హాయిగా ఎగ్జామ్ రాసేయండి..
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం నుంచి, సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభమవుతాయి. 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగనున్న పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 4,82,677 మంది ఫస్టియర్ విద్యార్థులుండగా, 4,65,022 మంది సెకండియర్ విద్యార్థులున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మూడు గంటల పాటు పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం రెండు కంట్రోల్ రూం నంబర్లు 040-24601010, 040-24644027ను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే నిమిషం నిబంధనను ఉంటుందని, ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించమని అధికారులు హెచ్చరించారు. ఇక గైర్హాజరయ్యే విద్యార్థుల సమాచారాన్ని సేకరించేందుకు మరో యాప్ను అందుబాటులోకి తెచ్చారు.
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండగా, విద్యార్థులకు విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. టెన్షన్ పడకుండా, కాన్ఫిడెంట్గా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షల నిర్వహణపై నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయం నుంచి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరీక్షలకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇంటర్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లతో విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తారని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్, ఇంటర్ పరీక్షల విభాగం కంట్రోలర్ పాల్గొన్నారు.