సూర్యాపేట : తెలంగాణకు కావాలని నిధులు ఇవ్వకుండా కేంద్రం రాష్ట్రం పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని ఆత్మకూరు( ఎస్ ) మండలం ఏపూర్ గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి,ఎంపీ లింగయ్య యాదవ్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఆసరా పెన్షన్లతో వృద్ధుల ఆత్మగౌరవం పెరిగింది. గుజరాత్లో ఇప్పుడు పెన్షన్లు ఆగిపోయాయన్నారు. తెలంగాణలో మాత్రం నిరాఘాటంగా ఇస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మూర్ఖులు అని మండిపడ్డారు.వరంగల్ లో డిక్లరేషన్ అంటూ నానా హంగామా చేశారు.
70 ఏళ్లు దేశాన్ని సర్వనాశనం చేసి ఈ రోజు నీతులు చెప్తున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరి అక్కడ రైతులకు ఎందుకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. బీజేపీ వాళ్లకు తెలంగాణ అమరులు ,నాయకులు ఎవరో తెలియదు. రైతుల మోటర్లకు మీటర్లను పెట్టమంటున్న బీజేపీ వాళ్లను తరిమికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు.
సూర్యపేట నియోజకవర్గంలో కాళేశ్వరం జలాలు సందడి చేస్తున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి అహర్నిశలు కృషి చేసి కాళేశ్వరం నీళ్లు సూర్యాపేట జిల్లాకు తీసుకొచ్చారన్నారు. గ్రామాలకు ఇవ్వాల్సిన రాష్ట్ర వాటా నిధులు అన్ని విడుదల చేసాం. కేవలం కేంద్రం ఇవ్వాల్సిన వాటా నిధులు ఇవ్వడం లేదన్నారు. సర్పంచులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..పల్లె ప్రగతితో గ్రామాలు సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయన్నారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు. దేశ ప్రజలను నట్టేట ముంచి, అందరిని పేదవాళ్లుగా మార్చడమే బీజేపీ ,కాంగ్రెస్ పార్టీల విధానమని విమర్శించారు.