హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్ను ప్రజల కోణంలో రూపొందించాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, మన ముందున్న లక్ష్యాలు అన్నీ ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు చెప్పేద్దామని పేర్కొన్నారు. అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారుచేయాలని అధికారులకు సూచించారు. దుబారా చేయకుండా, వృధా ఖర్చులు తగ్గించాలని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరపు వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఆదాయ, వ్యయాల వాస్తవికతను ప్రతిబింబించేలా రూపొందించాలని స్పష్టంచేశారు. బుధవారం ఆయన సచివాలయంలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమారతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను నూటికి నూరుపాళ్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదాయం, ఖర్చులపై పకాగా అంచనాలను రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి వీలైనన్ని గ్రాంట్లను రాబట్టేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. కొంతమేరకు రాష్ట్రం వాటా చెల్లిస్తే కేంద్రం తన వంతు వాటాగా ఇచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో కేంద్రానికి పేరు వస్తుందనో, రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా పేరు వచ్చేది లేదనో బేషజాలకు పోవద్దని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా బడ్జెట్ కసరత్తు జరగాలని సమావేశంలో నిర్ణయించారు.