హైదరాబాద్ : ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం విషయంలో కేంద్రం పక్షపాత ధోరణి మరోమారు పార్లమెంట్ సాక్షిగా బట్టబయలు అయిందని పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. మంగళవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలజీవన్ మిషన్ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. 2018 నుంచి 2021-22 వరకు 2455.82 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని లిఖితపూర్వకంగా తెలిపారు.
అయితే అందులో ఈ నాలుగేళ్లలో కేవలం 311. 41 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసిందని మంత్రి తెలిపారు. ఈ నిధులను సైతం నేషనల్ రూరల్ డెవలప్మెంట్ వాటర్ సప్లై ప్రోగ్రాం నిర్వహణ, దానిపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమానికి వినియోగించామని ఆయన పేర్కొన్నారు.
ఇందులో నుంచి ఒక్క రూపాయి కూడా తెలంగాణ మిషన్ భగీరథకు అందించలేదు. పైగా మిషన్ భగీరథ పథకాన్ని ఆకాశానికి ఎత్తుతూ, అద్భుతంగా ఉందని అభినందిస్తూ అనేక అవార్డులను కేంద్రమే ఇచ్చింది. అలాగే మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టి జల్ జీవన్ మిషన్ పథకాన్ని జాతీయ స్థాయిలో ప్రవేశట్టిందన్నారు.
ఒక దశలో నీతి ఆయోగ్ 19వేల కోట్లు మిషన్ భగీరథకు ఇవ్వాలని సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదని మంత్రి ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అదే కేంద్ర ప్రభ్వుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర్ప్రదేశ్, గుజరాత్లకు పనులు మొదలుపెట్టిన దశలోనే వందలాది కోట్ల రూపాయల నిధులను ధారాదత్తం చేసిందన్నారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష మానుకొని తగు నిధులు అందించాలని మంత్రి దయాకర్ రావు డిమాండ్ చేశారు.