హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): నిరుడు నవంబర్ నుంచి ఇప్పటి వరకు.. అంటే దాదాపు ఐదు నెలల నుంచి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రానికి తెలంగాణ వేసిన సూటి ప్రశ్నలు ఇవీ.
1. సీజన్లవారీగా (వానకాలం, యాసంగి) మీరు ధాన్యం ఎంత కొంటారు?
2. ఏడాదికి ముందే తెలంగాణ నుంచి ఎంత ధాన్యాన్ని కొంటారో షెడ్యూలు ఇస్తరా? ఇవ్వరా?
3. పంజాబ్, హర్యానా మాదిరిగా మాదగ్గర కూడా నూటికి నూరుశాతం ధాన్యం ఎందుకు కొనరు?
4. కేంద్రం మద్దతు ధర ఇచ్చేది వడ్లకా? బియ్యానికా? కొనేది వడ్లా.. బియ్యమా?
5. రాష్ట్రంలో వరే వేయాలని బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలతో కేంద్రం ఏకీభవిస్తుందా? లేదా?
వీటికి తగిన జవాబు చెప్పకుండా.. వానకాలం కొంటం.. యాసంగి కొనబోం, రా రైస్ కొంటం.. పార్బాయిల్డ్ రైస్ కొనబోం.. వరి వెయ్యొద్దని అనట్లేదు.. పంట మార్పిడి మాత్రం అవసరం..ధాన్యం కొనము అని ఎవరు అన్నారు. ఇతర రాష్ర్టాల్లో కొంటున్నప్పుడు తెలంగాణలో ఎందుకు కొనం? అంటూ తలాతోకా లేకుండా జవాబిస్తుంది. ఇప్పటిదాకా ఇష్టం వచ్చిన ప్రకటనలో కాలం వెల్లదీస్తూ వచ్చిన కేంద్రం.. ఇవాళ (బుధవారం) పార్లమెంట్ సాక్షిగా తన అసలురంగు బయటపెట్టింది. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి నిర్దిష్టమైన హామీ ఇవ్వలేము అని విస్పష్టంగా తేల్చి చెప్పింది.
కర్ణాటకకు చెందిన ఎంపీ సుమలత బుధవారం పార్లమెంట్లో ఓ ప్రశ్నవేశారు. ధాన్యం సేకరణ విధానం ప్రకారం.. కనీస మద్దతు ధరకు దేశవ్యాప్తంగా వివిధ ధాన్యాల సేకరణ చేస్తున్నారా? రైతుల నుంచి ధాన్యం సేకరణపై ఏవైనా పరిమితులు విధించారా అని అడిగారు.
దీనికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖల సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జోషి.. రాతపూర్వకంగా ఇచ్చిన జవాబు ఏమిటంటే.. రాష్ట్రంలో ధాన్యం సేకరణ అన్నది రైతులు పండించే పంటపై మాత్రమే ఆధారపడి ఉండదు.. మార్కెట్లో నిల్వలు, కనీస మద్దతు ధర, మార్కెట్ ధర, డిమాండ్, సరఫరా, ప్రైవేటు వ్యాపారుల ఆధారంగా ఉంటుంది.. అని.
రైతుల పట్ల, వారు పండించే ఉత్పత్తుల పట్ల కేంద్రం వైఖరి ఏమిటో పాలకు పాలు.. నీళ్లకు నీళ్లుగా తేటతెల్లమైపోయింది. రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లు రకరకాలుగా జరుగుతుందని లౌక్యంగా చెప్పడం ద్వారా మొత్తం ధాన్యం కొనేది లేనేలేదని తేలిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ధాన్యం సేకరణపై రైతులకు కేంద్రం ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు.
సీజన్కు ముందే ఎంత కొంటారో చెప్తే.. దాని ప్రకారం రైతులు పంట వేసుకొంటారు అంటే దానికి జవాబివ్వరు పోనీ ఏడాదికి ముందే ధాన్యం సేకరణకు సంబంధించి షెడ్యూలు ఇవ్వండంటే అదీ ఇవ్వరు..
కనీసం పంట చేతికొచ్చినంక కొంటరేమోనన్న ఆశతో పండిస్తే.. ఆ తరువాత మేము కొనబోమని కేంద్రం అంటే రైతులు ఆ పండించిన ధాన్యాన్ని ఏం చేసుకోవాలి? ఇది రైతులను వేధించడం కాక మరేమిటి? రాష్ట్రంలో గగ్గోలు పెడుతున్న బీజేపీ స్థానిక నేతలు ఇప్పుడేమంటారు?
కేంద్రం తాజాగా చెప్పిన జవాబు వెనుక పెద్ద కుట్రే దాగుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం జవాబు పరిశీలిస్తే క్రమంగా ధాన్యం కొనుగోళ్లను బంద్ చేసే అవకాశం ఉన్నదనే విషయం స్పష్టమవుతున్నది. కొంతకాలంగా కేంద్రం ధాన్యం కొనుగోళ్లను ఒక క్రమపద్ధతిలో తగ్గిస్తూ వస్తున్నది. గత రెండేళ్లుగా దేశ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల లెక్కలను గమనించినా కూడా కేంద్రం కుట్ర బోధపడుతుంది. ఎఫ్సీఐ ఏడాది కాలంలో ఏకంగా 1.58 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు తగ్గించింది. ఇందులో భాగంగానే ఈ వానకాలంలో తెలంగాణలో సుమారు కోటి టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటే.. కేంద్రం మాత్రం కేవలం 40 లక్షల టన్నులు మాత్రమే కొంటామని తొలుత ప్రకటించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. ధాన్యం సేకరణ పెంచాలని డిమాండ్ చేయడంతో మరో 20 లక్షల టన్నులకు పెంచింది. మళ్లీ డిమాండ్ చేస్తే ఇంకో 9 లక్షల టన్నులకు పెంచింది. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనబోమనే ప్రకటన కూడా ధాన్యం కొనుగోలు నుంచి తప్పించుకొనే ప్రణాళికలో భాగమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ధాన్యం కొనుగోలు నుంచి తప్పించుకొనేందుకు కేంద్రం అసలైన అస్ర్తాన్నే వినియోగించింది. డిమాండ్, సరఫరా సూత్రాన్ని ధాన్యం కొనుగోలుకు ముడిపెట్టింది. మార్కెట్లో డిమాండ్ ఉంటే, సరఫరా చేయగలిగితేనే ధాన్యం కొంటారు. మార్కెట్లో డిమాండ్ లేనిపక్షంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలును నిలిపేస్తారు. డిమాండ్కు ధాన్యం కొనుగోలుకు లింకుపెట్టి ఎంత పెద్ద కుట్ర పన్నారో రైతాంగం గమనించాల్సిన అవసరమున్నది. రైతులకు నష్టం రావొద్దని, రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రం భావిస్తే.. డిమాండ్ పెంచేందుకు తీసుకొన్న చర్యలేమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎగుమతులను ప్రోత్సహించాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా..? రైతులు పండించిన ధాన్యంకు మార్కెట్లో డిమాండ్ను సృష్టించాల్సిన బాధ్యత కేంద్రానిది కాదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పడినప్పటి నుంచి విదేశాలకు ఎగుమతులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. పెరగాల్సిన స్థాయిలో పెరగలేదనే అభిప్రాయాలను ఎగుమతిదారులు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే, ఉద్దేశపూర్వకంగానే ఎగుమతులను ప్రొత్సహించకుండా, డిమాండ్ను తగ్గించే కుట్ర చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ఆహారభద్రత భాధ్యతనుంచీ తప్పుకొనే యత్నం చేస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ గమనిస్తే త్వరలోనే కేంద్రం ధాన్యం కొనుగోలును బంద్ చేయడం ఖాయమని తెలుస్తున్నది.