హైదరాబాద్, అక్టోబరు 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడానికి ముందు కేంద్ర ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నది. హైదరాబాద్లోని తాజ్కృష్ణాలో బసచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు మంగళవారం వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అయ్యారు. బుధవారం వారు జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్ర్లు, ఎస్పీలతో భేటీ కానున్నారు.
ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా బుధవారం దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై వాకథాన్, సైక్లింగ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలను ఉదయం 6.30 గంటలకు సీఈసీ రాజీవ్కుమార్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ సంస్థ సహకారంతో చేపట్టనున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలపై డీజీపీ అంజనీకుమార్ ద్వారా సమాచారం తీసుకున్నట్టు తెలిసింది. ఈసారి కూడా సరిహద్దు రాష్ర్టాల నుంచి కొంత అదనపు సిబ్బందిని రంగంలోకి దించే ఆలోచన ఉన్నట్టు సమాచారం. ఎన్నికల సందర్భంగా దొరికే మద్యం, డబ్బు వివరాలను వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపేలా ప్రత్యేకంగా రూపొందించిన యాప్ను తెలంగాణలో వినియోగిస్తారని తెలిసింది. ఎన్నికలకు అతి త్వరలో షెడ్యూల్ జారీ కానున్న నేపథ్యంలో ట్రై కమిషనరేట్లు, అన్ని జిల్లాలవ్యాప్తంగా ఉన్న లైసెన్స్డ్ ఆయుధాలను పోలీసులకు, అధీకృత సంస్థలకు తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీకానున్నాయి. ఆయుధాల లైసెన్సులు కలిగినవారిలో జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ భద్రతా సిబ్బందిని, క్రీడాకారులను మినహాయించనున్నారు.