హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డెక్కన్ సిమెంట్స్ అక్రమ వ్యవహారాలపై బుధవారం ఢిల్లీలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ) విచారణ చేపట్టింది. పసుపులేటి సురేశ్బాబు అనే ఇంజినీర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ లు చేసిన నేపథ్యంలో జరిగిన ఈ విచారణకు.. డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యంతోపాటు రాష్ట్ర అటవీశాఖకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు, సంబంధిత కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అధికారులు హాజరయ్యారు. ఫిర్యాదుదారుని వాదనలను సీఈసీ పరిగణనలోకి తీసుకున్నది. డెక్కన్ సిమెంట్స్ కంపెనీపై భారీ ఎత్తున ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వంలో చలనమెందుకు లేదని నిలదీసింది. ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంలోని మతలబేమిటని ప్రశ్నించింది. రెండు వారాల్లో పూర్తిస్థాయి నివేదికను కమిటీ ఎదుట ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలను న్యాయమైనగా భావించింది. ఫిర్యాదుదారు సమక్షంలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని స్పష్టంచేసింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలు ఎందుకు పాటించలేదని, అటవీ చట్టాలు ఎందుకు ఉల్లంఘించారని డెక్కన్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది.
రాష్ట్రంలో మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాన అనుచరుడు రోహిణ్రెడ్డి డెక్కన్ సిమెంట్స్ వద్ద నుంచి భారీ ఎత్తున డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలొచ్చాయి. యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరిం చారంటూ మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితాపటేల్ కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే డెక్కన్ సిమెంట్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. డెక్కన్ సిమెంట్స్కు సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం సమీపంలోని సైదుల్నామా రిజర్వు ఫారెస్టులో ప్రభుత్వం 1987లో తొలిసారి 22.5 హెక్టార్లు, 1999లో రెండోసారి 73.93 హెక్టార్లు, మూడోసారి 2013లో 183 హెక్టార్ల భూమిని కేటాయించింది. ఈ క్రమంలో యాజమాన్యం ప్రభుత్వం తనకు కేటాయించిన భూమిలోనే కాకుండా అదనంగా మరో 33 హెక్టార్ల భూమిలో తవ్వకాలు జరిపిందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై పదేండ్లుగా వివాదం కొనసాగుతూనే ఉన్నది. దీనిపై పసుపులేటి సురేష్బాబు ఎన్జీటీలో కేసు వేశారు. సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి హద్దులు చేరిపేశారని, అటవీశాఖ అధికారులు అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా ఏర్పాటు చేసిన సరిహద్దు రాళ్లను అడ్డగోలుగా మార్చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యం ఆక్రమణలపై నోరు మెదపడంలేదని, 32 హెక్టార్ల భూమిలో 8 హెక్టార్ల భూమిలో ఆక్రమణలు జరిగినట్టు వారు ఒప్పుకొన్నారని, కానీ, డెక్కన్ సిమెంట్స్ వారి ఆధీనంలో ఉన్న మిగిలిన భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వలేదని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ)విచారణ చేపట్టింది.