హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): అంతరించిపోతున్న జాతుల పరిరక్షణలో భాగంగా హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ మరో కీలక అధ్యయనానికి ప్రాతినిధ్యం వహించనున్నది. హిమాలయాల్లో మాత్రమే కనిపించే గుడ్డెలుగు మనుగడను అన్వేషించేందుకు కృషి చేయనున్నది. ఇందులో భాగంగా పశ్చిమబెంగాల్లోని కొండ ప్రాంతాల్లో వీటి జాడను కనుగొనేందుకు సీసీఎంబీ పరిశోధనలు చేయనున్నది. దేశంలోనే తొలిసారిగా వీటి సంఖ్య, నివాస ప్రాంతాలను పక్కాగా అంచనా వేయనున్నది. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా వాటి జనాభాను శాస్త్రీయంగా నిర్ధారించనున్నది. ఉత్తర బెంగాల్లోని పర్వతాలు, మైదాన ప్రాంతాల్లో సంచరించే 130కి పైగా ఎలుగుబంట్ల శాంపిళ్లను సేకరించి సీసీఎంబీకి బెంగాల్ అటవీ శాఖ అధికారులు అందజేశారు. ఈ నమూనాలను పరిశీలించి, వాటి సంఖ్యను లెక్కించనున్నారు. ఇప్పటికే వాటి ఆవాసాలను 241 గ్రిడ్లుగా విభజించి ప్రతి గ్రిడ్ మధ్య ముండ్ల కంచెను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.
రెండు నెలలు నిద్రాణ స్థితిలో
ఏటా రెండు నెలల పాటు హిమాలయన్ బ్లాక్ గుడ్డెలుగులు నిద్రాణ స్థితిలో ఉంటాయి. సహజంగా 12 వేల అడుగుల ఎత్తులో మాత్రమే నివసించే ఈ జంతువులు.. శీతాకాలంలో క్యాలరీలు అధికంగా ఉండే ఆహారం కోసం 5 వేల అడుగుల కిందకు దిగివస్తాయి. వాటి నివాసిత ప్రాంతాల్లో మారుతున్న వాతావరణం వల్ల గత రెండేండ్లలో ఎలుగుబంట్ల సంఖ్య గణనీయంగా పడిపోతున్నట్టు గుర్తించారు. వీటి నిర్వహణ, జనావాసాల్లో సంచారాన్ని నియంత్రించేందుకు బెంగాల్ ప్రభుత్వం నమూనాలను సీసీఎంబీకి పంపినట్టు తెలిసింది.