సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణలో భాగంగా మౌస్ డీర్ (ఎలుకను పోలిన జింక)ల సంఖ్యను పెంచేందుకు సీసీఎంబీ పరిశోధనలు చేస్తున్నది. అంతరించిపోయే దశలో ఉన్న ఈ జీవులను పరిరక్షించేందుకు వాటి పునరుత్పత్తిపై పదేండ్లుగా అధ్యయనం చేస్తున్నది. పండ్లు, ఆకులు తింటూ బతికే ఈ చిన్న జీవులు 12 నుంచి 15 అంగుళాల ఎత్తు ఉంటూ జీవవైవిధ్యాన్ని కాపాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే వీటిని విచ్చలవిడిగా వేటాడటంతో వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. దీంతో వాటి సంతతిని పెంచేందుకు సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ ఉమాపతి బృందం పరిశోధనలు చేస్తున్నది. వాటి సంతానోత్పత్తి, జీవనశైలిని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జూపార్క్లో రెండు మగ, నాలుగు ఆడ మౌస్ డీర్లను పెంచుతున్నారు. బోనుల్లో వీటిని పెంచి ఆ తరువాత అడవుల్లో విడిచిపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
విశేషాలెన్నో…
కేవలం దట్టమైన అడవుల్లో మాత్ర మే బతికే ఈ జింకల జీవనశైలి మిగిలిన శాఖాహార జంతువుల కంటే భిన్నమైనది. రాత్రి సమయంలో మాత్రమే ఇవి చురుగ్గా తిరుగుతుంటాయి. నెమరువేసే జీవుల్లో మూడు గదులు ఉండేది ఇదొక్కటే. ఇవి ఫెరోమెన్లను విడుదల చేస్తూ లైంగిక సంపర్కానికి సమ్మతిని తెలుపుతుంటాయి. ఆడ జింకల్లో పునరుత్పత్తి సామర్థ్యం ఎక్కువ ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఇవి పిల్లలను కన్న నాలుగు నుంచి ఆరు గంటల వ్యవధిలోనే మళ్లీ పునరుత్పత్తికి సిద్ధమవుతాయని తెలిపారు. సాధరణంగా క్షీరదాల్లో కనీసం 15-24 గంటల తర్వాత పునరుత్పత్తి వ్యవస్థ పనిచేస్తుండగా ఇవి మాత్రం అతి తక్కువ సమయంలో సంపర్కానికి సిద్ధమవుతాయని పేర్కొన్నారు.