CCMB | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): భూమిలోను, నీటిలోను జీవించగల ఉభయచరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. శిలీంధ్రాల ద్వారా సోకే అరుదైన వ్యాధి కప్పలను, నీటి పాములను కబళిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఉభయచర జీవులకు కైత్రిడియోమైసిస్ అనే వ్యాధి సోకి అవి అంతరించి పోయే ప్రమాదం ఏర్పడింది. క్రమంగా విస్తరిస్తున్న ఈ అరుదైన వ్యాధిని గుర్తించేందుకు సీసీఎంబీతోపాటు ఆస్ట్రేలియా, పనామా పరిశోధకులు సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు.
సీసీఎంబీ బృందంలో బెంగుళూరు యూనివర్సిటీ, పద్మజా నాయుడు జూలాజికల్ పార్క్, అశోక వర్సిటీతోపాటు యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్వేల్స్, జేమ్స్ కుక్ యూనివర్సిటీ, స్మిత్సోనియన్ ట్రాపికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధనకుల భాగస్వామ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉభయచరాలకు సోకుతున్న వ్యాధులపై అధ్యయనం చేస్తున్నారు. తాము అభివృద్ధి చేసిన వ్యాధి నిర్ధారణ విధానం అద్భుతంగా పనిచేస్తున్నదని సీసీఎంబీ శాస్త్రవేత్త డా. కార్తికేయన్ తెలిపారు. వ్యాధిని నివారించే మార్గం కనుగొనకపోతే జీవావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు.