వనపర్తి : గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాణ్యతా విషయంలో ఎక్కడా రాజీపడొద్దన్నారు. శుక్రవారం టెలికాన్ఫెరెన్సులో పంచాయతీ రాజ్ అధికారులతో మాట్లాడారు.
సీసీ రహదారుల క్యూరింగ్ బాధ్యత సర్పంచులు, కార్యదర్శులదేనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పనులు మొదలుపెట్టని వారు వెంటనే మొదలుపెట్టి పూర్తి చేయాలన్నారు.
వనపర్తి నియోజకవర్గంలో రూ.7.10 కోట్లతో 196 సీసీ రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. భవిష్యత్ లో నల్లా కనెక్షన్ల కోసం రోడ్లు తవ్వకుండా ముందే అవసరమైన చోట పైపులు వేసుకోవాలన్నారు. మరో రూ.6 కోట్ల విలువైన సీసీ రోడ్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని మంత్రి తెలిపారు.
జిల్లా అంతటా సీసీ రోడ్ల నిర్మాణం వేగవంతం అయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకుసాగాలని మంత్రి సూచించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయకుంటే ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. బీటీ రోడ్లను రెన్యువల్ చేయించుకోవాలన్నారు.
త్వరలో ప్రయోగాత్మకంగా ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కాలనీలు ,గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మించి, మంచినీరు, కరంటు సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో పల్లె ప్రకృతి వనాల సంరక్షణపై దృష్టిపెట్టాలని సూచించారు.
భీమా నీళ్లు విడిచినప్పుడల్లా మోటర్లతో ఖాన్ చెరువును నింపాలి. అలుగుపారేంత వరకు మోర్లు నడిపించాలి. పెద్దగూడెం గ్రామ రైతులు, ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో శ్రద్ధ చూపాలని మంత్రి సూచించారు. కరోనా విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.