హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి మార్చి 25లోపు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, డీఆర్డీవోలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖ ఇంజనీర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలని, ఉపాధి హామీ పథకంలో భాగంగా మంజూరైన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను గడువులోగా పూర్తి చేయించాలని చెప్పారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని పనులకు పాలనాపరమైన, సాంకేతికపరమైన మంజూరును పూర్తిచేసి సత్వరమే పనుల గ్రౌండింగ్ చేపట్టాలని ఆదేశించారు. ఆ వెంటనే బిల్లుల చెల్లింపుల కోసం ఎఫ్టీవో జనరేట్ చేయాలని సూచించారు. మెటీరియల్ బడ్జెట్ నిధులు ఫిబ్రవరిలో రానున్నాయని వెల్లడించారు. టెలి కాన్ఫరెన్స్లో ఆ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.