హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్తో తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము తప్పు చేయలేదని రాష్ట్ర పౌరసరఫరాల, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తమ సమాధానాలతో సీబీఐ అధికారులు సంతృప్తి చెందారని తెలిపారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో సీబీఐ అధికారులు గురువారం ఢిల్లీ కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ప్రశ్నించారు. ఎనిమిది గంటలపాటు సాగిన విచారణ అనంతరం మంత్రి గంగుల, ఎంపీ వద్దిరాజు మీడియాతో మాట్లాడారు.
శ్రీనివాస్ ఫోన్ కాంటాక్టుల్లో తమ ఫోన్ నంబర్లు ఉండటంతో సీబీఐ అధికారులు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు ఢిల్లీకి వచ్చినట్టు తెలిపారు. ‘మాకు చట్టాలంటే గౌరవం ఉన్నది. అందుకే నోటీసులు అందిన వెంటనే ఢిల్లీలో సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యాం. వాళ్లు సేకరించిన డాటా అంతా మా ముందు పెట్టి ప్రశ్నించారు. నేను చెప్పిన అన్ని సమాధానాలు రికార్డు చేసుకున్నారు. నన్ను, మా బావగారిని (వద్దిరాజు) వేర్వేరుగా ప్రశ్నించారు. అన్ని విషయాలు ఉన్నది ఉన్నట్టు చెప్పాం. మేం ఏం తప్పు చేయలేదు. కాబట్టే మేం చెప్పిన అన్ని విషయాలు వారు సరిచూసుకున్నా ఏం తేడాలు లేవు.
మా స్టేట్మెంట్లు రికార్డు చేశారు. ఒక ఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో విచారించారు. నిందితుడు శ్రీనివాస్ను కూడా పిలిపించారు. అతడు మమ్మల్ని గుర్తించినట్టు చెప్పారు. శ్రీనివాస్ కూడా మాతో ఎలాంటి సంబంధాలు లేవని సీబీఐ అధికారుల ముందు అంగీకరించారు. ఇద్దరి వాదన విన్న తర్వాత వాళ్లు సంతృప్తి చెందారు. మళ్లీ రమ్మని సీబీఐ అధికారులు చెప్పలేదు’ అని గంగుల తెలిపారు. మున్నురు కాపు బిడ్డగా మాత్రమే శ్రీనివాస్ను వారం క్రితం మున్నూరుకాపు సమావేశంలో, అంతకుముందు ఒకసారి కలిసినట్టు వెల్లడించారు. సీబీఐ అధికారులకు అన్ని అంశాలు వివరించినట్టు ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.