హైదరాబాద్ : కేజీబీవీ బంకర్ బెడ్స్ ( Bunkers Beds ) టెండర్లలో జరిగిన రూ.100 కోట్ల కుంభకోణంపై వెంటనే సీబీఐ విచారణ ( CBI investigation ) జరపాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ( Gellu Srinivas Yadav ) డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంభకోణం విషయంలో ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం లో చలనం లేదని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవినీతి అడ్డుకట్టలేకుండా కొనసాగుతోందని విమర్శించారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ విద్యార్థులు చదువుకునే కేజీబీవీ పాఠశాలల్లో మౌలిక వసతుల పేరుతో ఈ టెండర్లలో భారీ అవినీతి జరిగిందని పేర్కొన్నారు .
నాసిరకం బంకర్ బెడ్స్ సరఫరా చేసి టెండర్లలో నియమ నిబంధనలను ఉల్లంఘించి ట్రూఫా , ముఫత్లాన్ కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ. 12 వేల ఒక బెడ్డును లోకల్ ఎంఎస్ఎంఈలకు లకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో టెండర్లో భాగస్వామ్యం చేసారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అదే బెడ్డును రూ. 35 వేలకు మధ్యప్రదేశ్ నుంచి కొనుగోలు చేస్తూ ఒక్కో బొడ్డుపై 22 వేల రూపాయలను ఎస్టీమేషన్ కాస్ట్ పెంచి కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. మొత్తం 45,360 బెడ్లకు గాను ఒక్కో బెడ్డుకు రూ. 33,446 అందజేస్తున్నాని, దాదాపుగా రూ. 164 కోట్ల రూపాయలను ఢిల్లీలో రాహుల్ గాంధీకి చేరవేస్తున్నారని దుయ్యబట్టారు.
ఈ కుంభకోణంపై వెంటనే సీబీఐతో న్యాయ విచారణ జరపాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ లోకాయుక్తకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు.