హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : కేజీబీవీల్లో బంకర్బెడ్స్ కుంభకోణంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీఆర్ఎస్వీ డిమాండ్ చేసింది. అర్హతల్లేని కంపెనీలకు కేటాయించిన టెండర్లను తక్షణమే రద్దుచేయాలని, బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణాను కలిసి వినతిపత్రం సమర్పించింది. బంకర్బెడ్స్ ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ. 60కోట్ల నుంచి రూ. 160కోట్లకు పెంచి ప్రజాధనానికి గండికొట్టారని గెల్లు శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా ట్రూఫ్లా, మాఫత్లాల్ కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ టెండర్లు రద్దుచేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఉపాధ్యక్షుడు తొట్ల స్వామి, తుంగ బాలు, ఆవాల హరిబాబు, విశాల్, నితీశ్, నవీన్, రాహుల్ తదితరులు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.