సీబీఐ నోటీసు కేవలం వివరణ కోసమే ఇచ్చిందని తెలిసినప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ సోషల్ మీడియా కుట్రలకు పాల్పడుతున్నదని, వాస్తవాలను కప్పిపుచ్చుతూ బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నదని టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): దున్నపోతు ఈనిందంటే.. దూడను దొడ్లో కట్టేయమన్నట్టు ఉన్నది బీజేపీ, దాని చేతిలోని వాట్సాప్ యూనివర్సిటీ పరిస్థితి. ఓ కేసుకు సంబంధించి కొన్ని అంశాలపై వివరణ కోసం ఎమ్మెల్సీ కవితకు సీబీఐ జారీచేసిన నోటీసుపై బీజేపీ నానా యాగీ చేస్తున్నది.
అసలు జరిగింది ఇదీ..
శుక్రవారం ఎమ్మెల్సీ కవిత పీఏకి సీబీఐ అధికారులు రెండుసార్లు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకొన్న ఆమె, వెంటనే సీబీఐ అధికారులకు ఫోన్ చేసి విషయమేమిటని అడిగారు. మనీశ్ సిసోడియాకు సం బంధించిన కేసులో క్లారిఫికేషన్ తీసుకొనేందుకు మీ వద్దకు రావాలని అనుకొంటున్నట్టు వారు కవితకు తెలిపారు. అయితే ఈ వ్యవహారం నోటి మాటగా ఉండరాదని, ఏం చేసినా అధికారికంగా ఉండాలని కవిత స్పష్టంచేశారు. అప్పుడే తాను సమాధానం ఇస్తానని తెలిపారు. దీంతో సీబీఐ అధికారులు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీచేశారు.
సమన్లు అయితే రారు.. పిలిపిస్తారు
ఏదైనా కేసులో ఎవరికైనా నోటీసులు జారీచేయటంలో పలు సెక్షన్లను దర్యాప్తు అధికారులు అనుసరించాల్సి ఉంటుంది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఇచ్చే నోటీసులు సమన్ల కిందికి రావు. కేసులో ఏమైనా సందేహాలు ఉంటే వివరణ తీసుకొనేందుకు మాత్రమే ఈ సెక్షన్ కింద నోటీసులు ఇస్తారు. సెక్షన్ 160 కింద నోటీసులు పొందేవారిని సాక్షిగా పరిగణించడానికి కూడా వీలుండదని న్యాయ నిపుణులు అంటున్నారు. కేసులో విచారణ కోసమే అయితే సమన్లు జారీచేస్తారు. తమ ఆఫీసుకే రావాలని ఆదేశిస్తారు. కానీ, సీబీఐ అధికారులే కవిత ఇంటికి వచ్చి వివరణ తీసుకొంటామని చెప్పారు. ‘మేమే వచ్చి వివరణ తీసుకొంటాం. మీకు ఎక్కడ (హైదరాబాద్ లేదా ఢిల్లీ) అనుకూలమో చెప్పండి. ఈ నెల 6వ తేదీన మిమ్మల్ని కలిసి వివరణ తీసుకొంటాం’ అని కవితను సీబీఐ అధికారులు అడిగారు. దీంతో హైదరాబాద్లోని తన ఇంట్లోనే వివరణ ఇస్తానని కవిత సమాధానమిచ్చారు.
వివరణ కోసం తనకు నోటీసు అందినట్టు ఎమ్మెల్సీ కవిత స్వయంగా ట్విట్టర్లో ప్రకటించారు. నోటీసు ప్రతిని కూడా ట్వీట్ చేశారు. నోటీసులకు భయపడే వ్యక్తులు, ఇబ్బందికర నోటీసులు వస్తే ఈ విధంగా ఎవరైనా ట్విట్టర్లో పోస్ట్ చేస్తారా? అంటే ఇక్కడే నిజానిజాలు తేటతెల్లమవుతున్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే బీజేపీ, వాట్సాప్ యూనివర్సిటీ అసత్యాలు ప్రచారం చేస్తూ కవితపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నది. తన చేతిలోని సోషల్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీలతో సీఎం కేసీఆర్పై, ఆయన కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నది. నోటీసు కేవలం వివరణ కోసమే ఇచ్చిందని తెలిసినప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు చేస్తున్నది. వాస్తవాలను కప్పిపుచ్చుతూ బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నదని టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.