హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Former MP YS Viveka) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి(Kadapa MP Avinash Reddy) కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఎదుట విచారణకు బుధవారం ఐదోసారి హాజరయ్యారు. ఐదు గంటల పాటు ఎంపీ అవినాష్ని సీబీఐ(CBI) విచారించింది. హైకోర్టు(High Court) సూచనల మేరకు రాత పూర్వకంగా ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. అవినాష్ విచారణ మొత్తం ఆడియో(Audio ), వీడియో(Video) రికార్డింగ్ చేయాలని ఆదేశించడంతో ఈ మేరకు సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు.
ఈనెల 25 వరకు అవినాష్ను అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు ఆదేశాలతో విచారణ ద్వారా సీబీఐ తమకు కావాల్సిన సమాచారం రాబట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. కోర్టులో జరిగిన వాదనల్లో వివేకా హత్య కేసు డీల్ రూ.40 కోట్లుగా సీబీఐ పేర్కొంది. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించడంతో, దీని చుట్టూనే సీబీఐ నగదు ఎక్కడ నుంచి వచ్చిందనే కోణంలో ఆరా తీసినట్లు తెలుస్తోంది.
సునీల్ యాదవ్ బ్యాంకు ఖాతాకు కోటి రూపాయలు బదిలీ జరిగినట్లు సీబీఐ చెబుతూ వచ్చింది. ఎక్కడ నుంచి ఈ నగదు వచ్చింది? ఎవరెవరు కలిసి ఈ మొత్తాన్ని సమకూర్చారనే సమాచారం పైన తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. హత్యలో అవినాష్ ప్రమేయం ఉందని కోర్టులో సీబీఐ వాదించింది. ఆధారాల టాంపరింగ్ జరిగినట్లు ఆరోపించారు. నిందితులతో ఉన్న సంబంధాలపైన ఆరా తీసినట్లు తెలుస్తోంది. అటు అవినాష్ తండ్రి భాస్కర్రెడ్డిని,హత్య కేసులో మరో నిందితుడు ఉదయ్కుమార్ను న్యాయవాదుల సమక్షంలో విచారించారు.