చార్మినార్, సెప్టెంబర్ 8: పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖానలో ప్రసవించిన మహిళ మృతికి వైరల్ ఫీవరే కారణమని, ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయలేదని వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్రెడ్డి స్పష్టం చేశారు. ఆమెకు కు.ని ఆపరేషన్ జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవమని అన్నారు. విషయం తెలిసిన వెంటనే డీఎంఈ సహా ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్, హైద్రాబాద్ జిల్లా ఆర్డీవో వెంకటేశ్వర్లు, బహదూర్పుర తహసిల్దార్ జుబేదాబేగం ఇతర అధికారలు విచారణ చేపట్టారు.
మహబూబ్నగర్ జిల్లా షాద్నర్, ఫారుఖ్నగర్ ప్రాంతానికి చెందిన సురేందర్ భార్య అలివేలు (26) ఈ నెల 4న ప్రసవం కోసం పేట్లబుర్జ్ దవాఖానలో చేరింది. ఆమెకు ఇదివరకే ఒకసారి సిజేరియన్, రెండుసార్లు అబార్షన్ అయినట్టు వైద్య రికార్డులు పేర్కొంటున్నాయి. ఆమెకు అదే రోజున రాత్రి 10.38 గంటల సమయంలో సిజేరియన్ ద్వారా ప్రసవం జరిపినట్టు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి తెలిపారు. ఆమెకు మగబిడ్డ జన్మించారని, తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.
అయితే 7వ తేదీన ఉదయం ఆమెకు తీవ్రమైన జ్వరం రావడంతో ఉస్మానియా దవాఖానకు తరలించామని, మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మరణించిందని తెలిపారు. ఆమెకు మరణానికి వైరల్ ఫీవరే కారణమని చెప్పారు. అలివేలుకు సిజేరియన్ మాత్రమే చేశామని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయలేదని డాక్టర్ మాలతి చెప్పారు. సిజేరియన్ తరువాత మూడు రోజులు ఆరోగ్యంగా ఉన్న అలివేలుకు జ్వరం కారణంగా వాంతులు, విరేచనాలు అయ్యాయని, రోగికి అందించిన చికిత్సకు ఆమె శరీరం స్పందించకపోవడం వల్లనే మరణించిందని డీఎంఈ రమేశ్రెడ్డి వివరించారు.