హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 13: అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్ పక్షాన నిలుస్తామని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్థులు ప్రకటించారు. ఈ మేరకు వారు చేసిన ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్కు శుక్రవారం మండలంలోని సింగాపూర్లో అందజేశారు. అదే గ్రామానికి చెందిన దాదాపు వంద మంది ముదిరాజ్ కులస్థులు టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలో పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో మత్స్యకారులు చాలా అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు.
రెడ్డి సంఘాల మద్దతు
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తామని రెడ్డి సంక్షేమ సంఘాలు ప్రకటించాయి. శుక్రవారం హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్హాల్లో జరిగిన రెడ్డి సంఘాల సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ సింగిల్ విండో అధ్యక్షుడు ఎడవెల్లి కొండారెడ్డి, ఎంపీపీ ఇరుమల్ల రాణి, సురేందర్రెడ్డి, రెడ్డి సంఘాల నాయకుడు, మాజీ కౌన్సిలర్ పోరెడ్డి శంతన్రెడ్డి మాట్లాడుతూ కాకతీయ కెనాల్ వద్ద రెడ్డి సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి స్థలంతోపాటు రూ.కోటి నిధులను ప్రభుత్వం మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు బాసటగా నిలుస్తామని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు చొల్లేటి కిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.