హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదికలో మున్నూరు కాపు జనాభాను 4%లోపు చూపించారంటూ తెలంగాణ మున్నూరు కాపు సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ గణాంకాలు యావత్ బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించి, తమ హక్కులను కాలరాసేవిగా ఉన్నాయని విమర్శించింది. సబ్బండ వృత్తి కులాల సమాజమైన తెలంగాణలో బీసీ కులాలను 46 శాతమే చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనలో అన్యాయానికి గురైన సహచర బీసీ కులాలకు సంఘీభావం ప్రకటించారు. అర్ధరాత్రి విడుదల చేసిన నివేదిక వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. మున్నూరు కాపుల ఉనికిని తగ్గించి చూపడాన్ని పద్ధతి ప్రకారం జరిగిన కుట్రగా అభివర్ణించారు. తక్షణమే దిద్దుబాటు చర్యలకు పూనుకోని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను ప్రభుత్వం ఎదుట పెట్టిన నేతలు త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తం పటేల్, పెద్ది పెంటయ్య, రాష్ట్ర కార్యనిర్వాహక నేతలు పాల్గొన్నారు.