Telangana Elections | హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 3న నోటిఫికేషన్ రానున్నది. ఈ నెల 9 నుంచే ఎన్నికల కోడ్ అమలవుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా భారీగా నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలు, ఓటర్లను ప్రభావితం చేసే ఇతర విలువైన వస్తువులు పట్టుబడుతున్నాయి. 2018 ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వచ్చిన గణాంకాల ప్రకారం పట్టుబడిన నగదు, మద్యం, ఇతర సామగ్రి విలువ సుమారు రూ.137 కోట్లు మాత్రమే. కానీ, తాజా ఎన్నికల సమయంలో కనీసం నోటిఫికేషన్ కూడా రాకుండానే బుధవారం నాటికి పట్టుకున్న మొత్తం విలువ రూ.165.81 కోట్లు. అంటే ఎన్నికల వేళ ఏ స్థాయిలో డబ్బు, మద్యం, డ్రగ్స్, తాయిలాలను రాజకీయ పార్టీలు, నాయకులు, అభ్యర్థులు ఓటర్లకు ఎరగా వేసేందుకు సిద్ధమవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. దీనితో పోలీసులు కూడా అదేస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తుండటంతో భారీగా పట్టుబడుతున్నాయి.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 3వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎస్కే అబ్దుల్ మజాద్ ఇంట్లో ఎలక్షన్ స్కాడ్ మధుకర్ పోలీసులతో కలిసి బుధవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ఆయన ఇంట్లో నిల్వ ఉంచిన 59 చీరలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పట్టణ ఎస్సై రాజేందర్, సిబ్బంది సీజ్ చేశారు.
– గర్మిళ్ల