నిజామాబాద్ లీగల్, సెప్టెంబర్ 18: సివిల్, క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా విలువైన కాలాన్ని కోల్పోయామని చెప్పారు. శనివారం నిజామాబాద్కు వచ్చిన ఆయన జిల్లా కోర్టు ప్రాంగణంలోని మీటింగ్ హాల్లో న్యాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. పాత కేసులకు ప్రాధాన్యమివ్వాలని, త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించిన ‘న్యాయవాదులు-న్యాయపరమైన నైపుణ్యాలు’ శిక్షణా తరగతులను జస్టిస్ కే లక్ష్మణ్ ప్రారంభించారు. న్యాయవాద వృత్తిలో నైపుణ్యం కీలకమని ఆయన పేర్కొన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ న్యాయవాదులు సేవాభావంతో పని చేయాలని, సామాన్యుడికి న్యాయ సేవలు అందించడంలో అగ్రభాగాన నిలువాలని సూచించారు.