హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మేధావి, ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్షాలపై నాగేశ్వర్ అనుచిత, నిరాధార వ్యాఖ్యలు చేశారని జనసేన నేతల ఫిర్యాదుతో కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పీఎస్లో ఈ కేసు నమోదైంది. ఇటీవల ఓ టీవీ చానల్ చర్చలో పాల్గొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిశారని, ఆ సమయంలో వైఎస్ జగన్ను అరెస్ట్ చేయాలని వారిపై ఒత్తిడి వస్తుందని చెప్పినట్టు పేర్కొన్నారు.
దీనిపై అమిత్ షా స్పందిస్తూ.. రాజకీయాల్లో చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు, కానీ జగన్ శాశ్వత మిత్రుడు..చంద్రబాబుకు జగన్తో శత్రుత్వం ఉండొచ్చు కానీ, మనకెందుకు? అని అన్నట్టు జనసేన కోర్ కమిటీ సమావేశం ద్వారా తనకు సమాచారం అందినట్టు నాగేశ్వర్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో జనసేన శ్రేణులు నాగేశ్వర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. జనసేన నేతల ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదైంది. ఈ వ్యాఖ్యలపై ఓ టీవీ చానల్ డిబేట్లో నాగేశ్వర్ మాట్లాడుతూ.. బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.