హైదరాబాద్: భారతదేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ అయిన్ టీ-వర్క్స్ మహిళా సాధికారత కోసం కేర్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. అట్టడుగున ఉన్న మహిళలు, బాలికలు వైద్యం, విద్య, ఆర్థిక తదితర అంశాల్లో సాధికారత సాధించేలా సరసమైన ధరలకు నూతన ఆవిష్కరణలను రూపొందించేందుకుగాను కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేయనుంది. ఇందులో భాగంగా కాలుష్యంతో ఆరోగ్యానికి హానిచేస్తున్న సాంప్రదాయ పొయ్యిలు, స్టౌలతోపాటు పలు ఇతర అంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఏటా నాలుగు వేలమంది ఇలాంటి అసమర్థమైన వంట పద్ధతుల ద్వారా అనారోగ్యంపాలై అకాల మరణం చెందుతున్నారు.
దీన్ని రూపుమాపేందుకు తగిన చర్యలు తీసుకోవడంతోపాటు విద్యకు దూరంగా ఉన్న గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని బాలికలకు ఫౌండేషన్, స్టెమ్ లెర్నింగ్ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడతారు. సులభతరంగా విద్యను అభ్యసించేందుకు శాస్త్రీయ నమూనాలు, ప్రయోగశాల సెటప్తో మొబైల్ ల్యాబ్లను అందుబాటులోకి తెస్తారు.
రాబోయే మూడేళ్లలో ఈ నూతన నమూనాలను పూర్తిస్థాయిలో ప్రభావంతంగా అమలయ్యేలా తగిన చర్యలు తీసుకుంటారు. టీ-వర్క్స్.. స్టార్టప్లు, ఎస్ఎంఈలు, కార్పొరేట్లకు నూతన తరం ఉత్పత్తులు, పరిష్కారాలను రూపొందించేందుకు, అలాగే అట్టడుగున ఉన్నవారి జీవితాల్లో సానుకూల మార్పు తెచ్చేందుకు కృషిచేస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని ప్రభావిత వర్గాలన్నింటికీ తమ ఆవిష్కరణల ప్రతిఫలాలు అందేలా కేర్ ఇండియా భాగస్వామ్యం దోహదం చేస్తుందని టీ-వర్క్స్ సీఈవో సుజయ్ కారంపురి పేర్కొన్నారు.